తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదంలో కల్తీ నెయ్యి(adulterated ghee) వినియోగించారని సీబీఐ(cbi) నేతృత్వంలోని కమిటీ తేల్చి చెప్పిందని.. ఈ కల్తీ నెయ్యితో ఏకంగా 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని.. సీఎం చంద్రబాబు(cm chandrababu) తెలిపారు. మంగళవారం సాయంత్రం అసెంబ్లీలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. నాటి ప్రభుత్వం శ్రీవారి భక్తుల మనో భావాలను ఏమాత్రం పట్టించుకోలేదని.. వారి భక్తి విశ్వాసాలతో ఆడుకుందని దుయ్యబట్టా రు. కల్తీ నెయ్యి వినియోగించడమే కాకుండా.. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడి చేశారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.
అనుకూలంగా మార్చారు..
వైసీపీ(ycp) హయాంలో టీటీడీ(ttd) బోర్డు చైర్మన్.. తమకు అనుకూలంగా తిరుమల నిబంధనలను మార్చుకున్నార ని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల శ్రీవారి అవసరం నిమిత్తం రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని తెలిపారు. అలాగే.. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాది అనుభవం ఉన్న సంస్థకు అప్పగించాలని నిర్ణయించారని చెప్పారు. అలానే.. రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీని 8 టన్నులకు తగ్గించారని.. ఇవన్నీ.. తమకు అనుకూలంగా ఉన్న డెయిరీలకు నెయ్యి కాంట్రాక్టును కట్టబెట్టేందుకు చేశారని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆహార భద్రతా నిబంధనలను కూడా అటకెక్కించారని సీఎం తెలిపారు. పోమిల్ జైన్, విపిన్ జైన్, భోలేబాబా ఆర్గానిక్ డెయిరీలు కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారని.. ఈ సొమ్ము అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఖాతాలోకి చేరిందని.. ఈ విషయాన్ని కూడా సీబీఐ కమిటీ తేల్చి చెప్పిందని వివరించారు. ల్యాబ్ నివేదికను సైతం ఫోర్జరీ చేశారన్నారు.
అందుకే కమిషన్..
ఈ సందర్భంగా ‘మహాపాపం’ పేరిట శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన తీరుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి అసెంబ్లీ(assembly)లో వివరించారు. నాడు తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ రిపోర్టు ఇచ్చిందని.. ఇప్పుడు మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేసిందన్నారు. కేవలం లడ్డూ మాత్రమే కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారని, 231 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని వాటి నిగ్గు తేల్చేందుకే ఏకసభ్య కమిషన్ వేశామన్నారు.
దేవుడే నాతో చెప్పించాడు..
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని.. తను చెప్పిన మాట వాస్తవమేనని అయితే.. అది తన సొంత అభిప్రాయం కాదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ప్రకారమే వెల్లడించానని తెలిపారు. ఆ విషయాన్ని దేవదేవుడే తనతో చెప్పించాడని చంద్రబాబు పేర్కొన్నారు.