శాసనమండలి(legislative council) సాక్షిగా రాయలసీమ ప్రాజెక్టులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తుత్తునియలు చేశారు. ఆధారాలు, జీవో నంబర్లు, కోర్టు ఉత్తర్వులనే ఆయుధాలుగా చేసుకుని వైసీపీ(ycp) సభ్యుల విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు. "సీమకు నీళ్లివ్వని చేతకానితనం మీది.. అబద్ధాలు ప్రచారం చేసే బరితెగింపు మీది" అంటూ నిమ్మల శివమెత్తారు.
ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకున్న జగన్(jagan): రాయలసీమ ఎత్తిపోతల పథకం(rayalaseema lift irrigation) ఆగిపోవడానికి వందకు వంద శాతం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఫల్యమే కారణమని మంత్రి స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టి, కేవలం మట్టి పనులు, గుంతలతో రూ. 900 కోట్లు బిల్లులు వాడుకున్నారని ధ్వజమెత్తారు.
ఎన్జీటీ మొట్టికాయలు - వైసీపీ నిద్రమత్తు: 2020 అక్టోబర్లో అనుమతులు లేకుండా పనులు చేయొద్దని NGT ఆదేశించినా, పంతానికి పోయి పనులు చేసి రూ. 2.65 కోట్ల జరిమానా కట్టించుకున్న ఘనత వైసీపీదేనని మంత్రి ఎద్దేవా చేశారు. "అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా.. మరి నిద్రపోతున్నారా?" అంటూ సూటిగా ప్రశ్నించారు.
లిఖితపూర్వక అబద్ధం - జీవో నంబర్ 364: రాయలసీమ ఎత్తిపోతల సాగునీటి కోసం కాదని, కేవలం తాగునీటి కోసం మాత్రమేనని 2023 ఆగస్టు 11న అఫిడవిట్ ఇచ్చి సీమ ప్రజల గొంతు కోసింది ముమ్మాటికీ జగన్ ప్రభుత్వమేనని ఆధారాలతో నిరూపించారు.
సీమకు జగన్ బిక్ష, ద్రోహం పై: మంత్రి నిమ్మల రామానాయుడు గణాంకాలను వివరిస్తూ.. "2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు సీమ ప్రాజెక్టులకు రూ. 14,000 కోట్లు ఖర్చు చేస్తే, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే. మరి సీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చుకుంటారు."
పొరుగు రాష్ట్ర నేతల మాటలు పట్టుకుని బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఈ ఏడాది 203 టీఎంసీల నీటిని సీమకు తరలించామని, గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉన్నా పట్టించుకోని గత పాలకుల తీరును ఎండగట్టారు. ప్రస్తుతం రూ. 3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను 730 కి.మీ దూరం తీసుకెళ్లి చివరి భూములకు కూడా నీరందిస్తున్నామని గర్వంగా ప్రకటించారు.
"నాడు కృష్ణదేవరాయల కాలంలో చెరువులు ఎలా కళకళలాడాయో.. నేడు చంద్రబాబు పాలనలో రిజర్వాయర్లు అలాగే జలకళతో ఉట్టిపడుతున్నాయి. రాయలసీమను రత్నాల సీమగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే" అని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.