ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ అనారోగ్యం పాలవ్వడం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. గత కొంతకాలంగా యాక్టివ్గా ఉంటున్న ఆయన, అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. నిన్న రాత్రి ఆయన అస్వస్థతకు గురవ్వగానే, కుటుంబ సభ్యులు అత్యవసరంగా హైదరాబాద్కు తరలించారు.
బొత్సకు ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ తెల్లవారుజామున ఆయనను ఆసుపత్రిలో చేర్పించి, తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
బొత్స అస్వస్థత వార్త తెలియగానే వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పెద్దాయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు పార్టీ నేతలు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శాసనమండలిలో విపక్ష నేతగా ఆయన పోషిస్తున్న పాత్ర కీలకమైనది కావడంతో, ఆయన త్వరగా తిరిగి రావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.