ఇరాన్(Iran) అధ్యక్షుడు ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ ముప్పేట దాడికి దిగింది. ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ అంతమొందించాయి. అయితే, అసలు ఈ దాడికి కారణమేంటి అని పరిశీలిస్తే..ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా(USA) అధ్యక్షుడు ట్రంప్(Trump) కళ్లల్లో ఆనందం కోసం...ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు(Netanyahu) ఇరాన్ ను టార్గెట్ చేశారని టాక్.
ఇరాన్పై ఇజ్రాయెల్(Israel) దాడులకు ప్రధాన కారణం.. తమ పౌరులను ఇరాన్ ప్రభుత్వం ఊచకోయడమేనని నెతన్యాహూ చెబుతున్నారు. అయితే.. దీనికి అసలు వేరే కారణం ఉందని తెలుస్తోంది. తనకు తాను శాంతి దూతనని చెప్పుకొంటున్న ట్రంప్కే ఇరాన్పై దాడి చేయాలని ఉంది. అయితే.. ఆయన ఆ పనిని నేరుగా చేయలేక తన మిత్ర దేశం ఇజ్రాయెల్తో చేయిస్తున్నారని అంటున్నారు. ఇక, ఇజ్రాయెల్ దాడి ప్రారంభించగానే.. అమెరికా కూడా రంగంలోకి దిగింది. వెంటనే భారీ ఎత్తున టెహ్రాన్లోని సైనిక స్థావరాలు సహా.. పలు జనసమ్మర్థ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. అమెరికాతో అణు ఒప్పందం చేసుకునేందుకు, ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ వినకపోవడంతోనే ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
గత కొన్నాళ్లుగా ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటుయుద్ధం కూడా కొనసాగింది. అయితే.. మధ్యలో విరామం ప్రకటించినా.. తర్వాత.. అమెరికా జోక్యంతో ఈ అనివార్యత నెలకొంది. అణు ఒప్పందం విషయంలో తమతో కలిసి రావాలని అమెరికా కోరుతున్నా.. ఇరాన్ ససేమిరా అనడం ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ను అమెరికా తెరవెనుక ప్రోత్సహిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
చావోరేవో తేల్చుకుంటామన్న ఇరాన్..
మరోవైపు ఇరాన్ ఈదాడులను బలంగా తిప్పికొడుతోంది. దీంతో మధ్య ప్రాచ్యం అగ్నిగుండమైంది. ఇరాన్ ఏకకాలంలో ఇజ్రాయెల్ తో సహా బహ్రెయిన్, కువైట్, సౌదీ, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యూఏఈలపై క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ తీరుతో అంతర్జాతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ బలం ముందు ఇరాన్ పెద్దగా పనిచేయదు. అయినప్పటికీ.. చావో రేవో అన్నట్టుగా ఇరాన్ వ్యవహరిస్తోంది.