దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నయనతార(Nayanthara), ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఆమె.. తాజాగా చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఒక ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఈ ఇంటి రిజిస్ట్రేషన్ విలువ మరియు సౌకర్యాల గురించి తెలిస్తే సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ముక్కున వేలేసుకోవాల్సిందే.
చెన్నైలో `పోయెస్ గార్డెన్` (Poes Garden) అంటే అది కేవలం ఒక ఏరియా మాత్రమే కాదు, అదొక పవర్ సెంటర్. సూపర్ స్టార్ రజనీకాంత్, దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత వంటి దిగ్గజాల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. ఇటీవల నటుడు ధనుష్ కూడా ఇక్కడ భారీ బంగ్లా కట్టుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అదే హై-ప్రొఫైల్ సర్కిల్లోకి నయనతార, విఘ్నేష్ శివన్ జంట చేరిపోయారు. తేనాంపేటలోని ప్రతిష్టాత్మక `లెగసీ` (Legacy) ప్రాజెక్ట్లో వీరు ఈ లగ్జరీ డూప్లెక్స్ను సొంతం చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ. 31.5 కోట్లు. చదరపు అడుగుకు సుమారు రూ. 21,946 వెచ్చించారు. సుమారు 14,369 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ డూప్లెక్స్ ఫ్లాట్, నాలుగు మరియు ఐదవ అంతస్తుల్లో విస్తరించి ఉంది. అంటే ఒక మినీ ప్యాలెస్ను తలపించేలా ఈ ఇల్లు ఉండబోతోంది. ఇక ఈ ప్రాపర్టీలో విశేషం ఏంటంటే.. ఇందులో నయనతారకు 90% వాటా ఉండగా, ఆమె భర్త విఘ్నేష్ శివన్(Vignesh Shivan)కు 10% వాటా ఉంది. కేవలం కార్ల పార్కింగ్ కోసమే వీరికి 8 స్లాట్లు కేటాయించారంటే, ఆ ఇంటి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును నయనతార తెలివిగా రియల్ ఎస్టేట్ మరియు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. చెన్నైతో పాటు దుబాయ్, హైదరాబాద్, కేరళలో కూడా నయన్కు విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.