రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 20 మాసాల్లోనే 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు(cm chandrababu) తెలిపారు. ఎన్నిక లకు ముందు తాము ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని అందరూ కలసి తిప్పికొట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు శాసనసభ(assembly) బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పనపై సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే 25 నూతన పాలసీలను తీసుకు వచ్చామని చంద్రబాబు తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చామని చెప్పారు. వైసీపీ హయాంలో కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా.. ఉన్నవారిని సైతం బెదిరించి రాష్ట్రం నుంచి తరిమి కొట్టారని విమర్శిం చారు. దీంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని తెలిపారు. కాగా.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తున్నామని.. దీంతో పోయిన కంపెనీలు కూడా తిరిగి వస్తున్నాయన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వస్తోంద న్నారు.
తిరుపతి, విశాఖ, అమరావతిలో ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా మరిన్ని పెట్టుబడులకు అవకాశం కల్పిస్తామన్నారు. ``పెట్టుబడులపై గత ప్రభుత్వానికి అవగాహన లేదు. అందుకే బెదిరించి.. కంపెనీలను పంపేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులకు అవకాశం కల్పించాం.దీనికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. ఈ విషయంలో రాజీ లేదు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రానికి సంపద వస్తుంది. అది జరిగితేనే.. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించగలం. సంపద సృష్టించగలం.`` అని చంద్రబాబు చెప్పారు. విశాఖకు ప్రస్తుతం కంపెనీలు పోటెత్తుతున్నాయని తెలిపారు. ఇలా జరగడం విశాఖ చరిత్రలోనే తొలిసారని పేర్కొన్నారు. తద్వారా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
తెలుగు-వెలుగు!
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలుగు భాషపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామ న్నారు. తెలుగును రక్షించుకునే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో గతంలో తెలుగు ఎత్తేసిన ప్పుడు అందరూ కలసి కట్టుగాఉద్యమించి.. తెలుగును రక్షించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా తీసుకుని తెలుగును మరింత సంరక్షించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.