ఏపీ సీఎం చంద్రబాబు(ap cm chandrababu).. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా మహిళా సాధికార త, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పెద్ద ఎత్తున చేయూతను అందిస్తున్నారు. బ్యాంకుల నుంచి విస్తృతంగా రుణాలు ఇప్పిస్తున్నారు. అరకు కాఫీ నుంచి కొండపల్లి బొమ్మల వరకు.. మంగళగిరి చేనేత నుంచి చేతివృత్తుల వరకు అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు.
ఆ క్రమంలోనే `స్వయం ఏపీ` పేరుతో సరికొత్త కార్యక్రమాన్నిచంద్రబాబు చేపట్టిన సంగతి తెలిసిందే. స్వయం ఏపీని ప్రమోట్ చేసేందుకు తానే `బ్రాండ్ అంబాసిడర్`గా వ్యవహరిస్తానని కూడా చెప్పారు. ఇప్పటికే.. సీఎం చంద్రబాబు.. అరకు కాఫీకి బ్రాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీనిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అలాగే.. గిరిజన ఉత్పత్తులైన తేనె సహా.. ఇతర వస్తువులను కూడా ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో `స్వయం ఏపీ`పేరుతో స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులను కూడా ఆయన ప్రమోట్ చేయనున్నారు.
వీటిలో దుస్తుల నుంచి తినుబండారాల వరకు అనేకం ఉంటాయి. పచ్చళ్లు, కారప్పొడులు, నూలు వస్త్రా లు, కొయ్య బొమ్మలు.. ఇలా ఒక్కటనేది అంటూ ఏమీ లేదు. స్వయం సహాయక బృందాలు ఏదైనా ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. వాటిని ఇక నుంచి చంద్రబాబు స్వయంగా ప్రచారం చేయనున్నారు. వాటికి సంబంధించి ఆయనే ప్రచార కర్తగా వ్యవహరిస్తారు. వాటిని ప్రమోట్ చేయడం ద్వారా.. మహిళా సంఘాలకు మరింత వ్యాపార అవకాశాలను కల్పించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తనపై ఉన్న విశ్వసనీయత, బ్రాండ్ ఏపీ నినాదం వంటివి కలిసి వస్తాయని అంచనా వేసుకున్నారు.
`స్వయం ఏపీ` విధానంలో ఉత్పత్తి చేసే వస్తువులను వినూత్నంగా ప్యాకింగ్ చేయనున్నారు. ప్యాకెట్ చూడగానే.. దానిలో ఏముంది? అని ఆసక్తిగా తెలుసుకునే వాటిని రూపొందిస్తారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు.. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఆహార పదార్థాలు.. మన్నికైన దుస్తులు.. కళాత్మకంగా ఉండే బొమ్మలను స్వయం సహాయక సంఘాలు రూపొందించాల్సి ఉంటుంది. వాటిని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రమోట్ చేసి.. తద్వారా అటు మహిళల సాధికారతకు.. ఇటు ఏపీ బ్రాండుకు కూడా పెద్దపీట వేయనున్నారు.
మహిళా సాధికారత తమ ఇంట్లోనే మొదలైందని, తమ ఇంట్లో ఇద్దరు మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదిగారని చంద్రబాబు అన్నారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు ఉపాధి, ఉద్యోగ కల్పనలో దూసుకుపోతున్నారని కితాబిచ్చారు. సూపర్ సిక్స్లో మెజారిటీ పథకాలను మహిళల పేరుతోనే అమలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివి మహిళలకు అంకితం చేశామన్నారు. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అన్ని విధాలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఆదాయాన్ని సంపాయిస్తున్నారని చెప్పారు. ``స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చే బాధ్యత తనదని అన్నారు.
కుటుంబ సబంధాలను పెంచే బాధ్యత మహిళలదేనని చెప్పారు. ప్రస్తుతం ఒకే ఇంట్లో నలుగురు ఉన్నా.. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దీనికికారణం సెల్ ఫోన్లేనని చెప్పారు. చిన్నారుల నుంచి కుటుంబ పెద్దల వరకు అందరూ ఫోన్లకు అంకితం అయిపోయారని.. దీంతో కుటుంబ సంబంధాలు తెలియడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు మహిళలు.. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెల్ ఫోన్ల వినియోగానికి టైం బౌండ్ పెట్టి.. కుటుంబ సభ్యులను ఒక దగ్గరకు చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు.
తన కుటుంబంలో ఇద్దరు మహిళా సారథులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు.. వ్యాపార వేత్తలుగా ఎదిగి మహిళా సాధికారతకు నిలువుటద్దగా నిలిచారన్నారు. తన ఇంట్లోనే మహిళా సాధికారతకు పెద్ద పీట వేసినట్టు తెలిపారు. ``నా భార్య, కోడలు సమర్థంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు.`` అని చంద్రబాబు చెప్పారు. ఇక, జనాభా పెరుగుదలపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభా సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి మహిళలే పూనుకోవాలని సూచించారు.