ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న కూటమి శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక టాస్క్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగబోతోందని స్పష్టం చేస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వచ్చే ఆరు నెలల్లోనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, ఇందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుటి నుంచే సమరోత్సాహంతో సిద్ధం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం తరపున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. `మనం చేస్తున్న పనిని మీడియాకు చెప్పుకోవడంలో ఎందుకు వెనుకబడుతున్నారు?` అంటూ మంత్రులను సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రతి ఇంటికీ చేరవేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ మనం గెలిచామని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని తేల్చి చెప్పారు.
కొత్త నిర్ణయాలు.. నీటి పన్నుపై క్లారిటీ!
పాలనలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, పంచాయతీల మాదిరిగానే నీటి సంఘాలు కూడా నీటి పన్ను వసూలు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడికి సీఎం సూచించారు. దీనివల్ల స్థానిక అవసరాలకు నిధుల కొరత ఉండదని ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గ్యాస్ కొరత తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను చంద్రబాబు హెచ్చరించారు. గ్యాస్ ధరలు లేదా కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్ ల వైపు మొగ్గు చూపుతున్నారని మంత్రులు సీఎం దృష్టికి తీసుకురాగా, దానివల్ల విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. విద్యుత్ లోటు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి, చంద్రబాబు ప్రకటనతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి అప్పుడే మొదలైపోయింది.