హైదరాబాద్లోని సచివాలయం-మూసీ పరివాహకం వద్ద నిర్మించాలని తలపెట్టిన మహాత్మా గాంధీ విగ్రహం(mahatma gandhi statue) చుట్టూ రాజకీయా లు ముసురుకున్న విషయం తెలిసిందే. గత కేబినెట్ సమావేశంలోనే గాంధీ విగ్రహ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) నేతృత్వంలోని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీనికిగాను ఎంత ఖర్చవుతుందన్న దానిపై పలు వార్తలు వచ్చాయి. దీని ఆధారంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. గాంధీ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని.. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం అవసరమా? అని బీఆర్ ఎస్ నాయకులు ప్రశ్నించారు.
ఇక, క్షేత్రస్థాయిలోనూ కొన్ని సోషల్ మీడియాలలో ఇదే విషయంపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. అప్పుల గురించి పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి.. ఇంత పెద్ద మొత్తంలో గాంధీ విగ్రహం కోసం ఖర్చు చేయడం ఎందుకన్న చర్చ కూడా సాగుతోంది. బీఆర్ ఎస్ నాయకులు దీనిని మరింత జోరుగా ప్రజల మధ్యకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. గాంధీ విగ్రహానికి 500 కోట్లు ఎవరూ ఖర్చు చేయడం లేదన్నారు. దీనిపై కేవలం పుకార్లు పుట్టించి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
కేవలం 70 కోట్లరూపాయలను మాత్రమే మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిని కూడా రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పాటు.. అక్కడే భారీ లైబ్రరీని కూడా నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దీనికి మరో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇవన్నీ.. రైజింగ్ తెలంగాణ లో భాగమేనని చెప్పారు. తెలంగాణను సుందర పర్యాటక రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతున్నామన్నారు. దీంతో గాంధీ విగ్రహం లెక్కలను అధికారికంగా ప్రకటించినట్టు అయింది.
ఇదేసమయంలో మూసీ నది ప్రక్షాళన విషయంపైనా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలా? వద్దా? అని నిలదీశారు. దీనిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. నగరంలో దోమలు.. వ్యాధులు పెరిగిపోయాయని .. దీనికి మురికి కూపాలే కారణమన్నారు. ఇప్పుడు వీటిని శుద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే.. దీనిని కూడారాజకీయం చేస్తున్నారని.. అన్నారు. ``మూసీ ప్రక్షాళనపై మీ స్టాండ్ ఏంటి?`` అనిరేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ను ప్రశ్నించారు.
అయితే, ఈ వ్యవహారంపై గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ(tushar gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. మన ఆలోచనల్లో గాంధీ తత్వం లేనప్పుడు గాంధీ విగ్రహం పెట్టి ఉపయోగం లేదని ఆయన అన్నారు. తమ ఇళ్లు కూల్చి గాంధీ విగ్రహం కట్టకూడదని ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు గాంధీ విగ్రహం కట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజల ఇల్లు కూల్చి గాంధీ విగ్రహం కట్టడం గాంధీ గారికి కీర్తినివ్వదని తేల్చి చెప్పారు.