మొయినాబాద్ ఫాంహౌస్ లో జరిగిన పార్టీలో అనూహ్య రీతిలో దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్(Eluru mp putta mahesh) తో పాటు అతని స్నేహితుడు నమిత్ శర్మల డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కొత్త ఫోకస్ పెట్టారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. వీరికి డ్రగ్స్(drugs) వినియోగించే అలవాటు కొత్తది కాదని.. చాలా పాతదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలే కారణంగా తెలుస్తోంది. తాజాగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో వీరి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ లో వెల్లడైన ఫలితాలు.. ఇతర మాదకద్రవ్యాల అవశేషాలు లభించటంతో పోలీసులు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది.
నిజానికి తాజా కేసుతో దీనికి సంబంధం లేనప్పటికీ.. మత్తు చరిత్రను తవ్వి తీస్తే.. సరికొత్త అంశాలు వెలుగు చూడటంతో పాటు.. డ్రగ్స్ సరఫరా గొలుసుకు సంబంధించిన కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పాత అంశాల మీద సరికొత్త ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేనదని పదకొండు మంది నిందితులు చెప్పినప్పటికీ.. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో పదకొండు మందిలో ఆరుగురికి పాజిటివ్ రావటం.. ఆ తర్వాత ఎర్రగడ్డ ఆసుపత్రిలో సేకరించిన నమూనాల్లో మిగిలిన నలుగురికి పాజిటివ్ రావటం తెలిసిందే.
ఇందులో నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫటమిన్.. మెథా యాంఫిటమిన్.. కొకైన్ నమూనాలు వెల్లడి కాగా.. పుట్టా మహేశ్ యాదవ్ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్.. మెథా యాంఫిటమిన్ ఆనవాళ్లు లభించాయి. నిజానికి పోలీసులు జరిపిన సోదాల్లో కొకైన్ తప్పించి మరెలాంటి మాదకద్రవ్యాలు లభించలేదు. కానీ.. నమిత్ శర్మ.. పుట్టా మహేశ్ నమూనాల్లో మాత్రం ఇతర డ్రగ్స్ ఆనవాళ్లు లభించటంతో.. వీరు శనివారమే ఇతర డ్రగ్స్ తీసుకున్నారా? లేదంటే అంతకు ముందే వాడారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో గతంపై ఫోకస్ చేస్తే.. అసలు విషయాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.
తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో పట్టుబడిన వారందరి రక్త నమూనాల్ని చూసినప్పుడు వారందరికీ కొంతకాలంగా మత్తుమందులు వాడే అలవాటు ఉందన్న విషయాన్ని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో.. ఈ కేసు లోతుల్లోకి వెళితే.. డ్రగ్స్ సప్లైయి చైన్ మీద మరింత అవగాహనకు రావటంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరికొందరి భాగోతాలు బయటపడొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.