తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు. అది సామాన్య కార్యకర్త అయినా, పార్లమెంట్ సభ్యుడైనా సరే.. తప్పు చేస్తే వేటు తప్పదని ఆయన మరోసారి నిరూపించారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ మెడకు గట్టిగానే చుట్టుకుంది. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయిన తీరు చూస్తుంటే, పార్టీలో పెను తుపాను ఖాయమనిపిస్తోంది.
యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో, క్లీన్ ఇమేజ్ ఉంటుందని భావించి పుట్టా మహేశ్కు ఎంపీ టికెట్ ఇస్తే, ఆయన ఆ నమ్మకాన్ని వమ్ము చేశారని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. "బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం క్షమించరాని నేరం. ఇలాంటి వారి వల్ల పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరం" అంటూ చంద్రబాబు క్లాస్ పీకారు.
కేవలం మాటలతో సరిపెట్టకుండా, చంద్రబాబు యాక్షన్ మోడ్ లోకి దిగిపోయారు. ఇప్పటికే పుట్టా మహేశ్కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేవలం 5 రోజుల గడువు మాత్రమే విధించారు. ఈ ఐదు రోజుల్లో ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, ఎంపీ అని కూడా చూడకుండా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు బాబు వెనకాడబోరని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడిగా మంచి రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని బాబు కుండబద్దలు కొట్టారు. "దురలవాట్లతో పార్టీ పరువు తీసే వారిని మోయాల్సిన అవసరం టీడీపీకి లేదు" అని ఆయన అన్న మాటలు ఇప్పుడు మిగిలిన నేతలకు కూడా హెచ్చరికగా మారాయి. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని బాబు గట్టిగానే హితవు పలికారు. మొత్తానికి ఏలూరు ఎంపీ వ్యవహారం టీడీపీలో హాట్ సీట్ లా మారింది. మరి ఆ 5 రోజుల డెడ్లైన్ లోపు పుట్టా మహేశ్ ఇచ్చే వివరణ బాబును శాంతింపజేస్తుందా? లేక ఏలూరు ఎంపీపై పార్టీ అధిష్టానం వేటు వేస్తుందా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.