తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం త్వరలో ఊహించని మలుపు తిరగబోతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు ఢిల్లీ(Delhi) వేదికగా కసరత్తు ముమ్మరమైంది. ఈ ప్రతిపాదన గనుక కార్యరూపం దాల్చితే, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణ రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ, లోక్సభ స్థానాలను ఏకంగా 50 శాతం మేర పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాల సంఖ్య 263కి చేరుతుంది. అలాగే తెలంగాణలో ఉన్న 119 స్థానాలు 179కి పెరుగుతాయి. ఇక లోక్సభ స్థానాల విషయానికొస్తే.. ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది. ఈ భారీ మార్పుతో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయి.
సాధారణంగా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరుగుతుందనే ఆందోళన ఉంది. అయితే, ఈ వివాదానికి చెక్ పెట్టేలా కేంద్రం యూనిఫామ్ 50 శాతం ఇంక్రీజ్ అనే ఫార్ములాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో సీట్లు పెరుగుతాయి. తద్వారా అటు అభివృద్ధికి, ఇటు రాజకీయ ప్రాతినిధ్యానికి సమన్యాయం జరుగుతుందనేది కేంద్రం(Central Govt) ఆలోచనగా కనిపిస్తోంది.
ఈ పునర్విభజన ప్రక్రియ కేవలం సీట్ల పెంపుకే పరిమితం కాదు. 2023లో ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే ఈ డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ తప్పనిసరి. 2027 నాటికి జనగణన పూర్తి చేసి, ఆ గణాంకాల ఆధారంగానే కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇది కొత్త తరం నాయకులు రాజకీయాల్లోకి రావడానికి ఒక గొప్ప అవకాశంగా మారనుంది. ప్రస్తుతం విపక్షాలతో ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఈ బిల్లు గనుక గ్రీన్ సిగ్నల్ సాధిస్తే, రాబోయే ఐదేళ్లలో మన రాజకీయ వ్యవస్థలో అతిపెద్ద మార్పును మనం చూడబోతున్నాం.