వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్(jagan) పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(sharmila) మరోసారి ఫైరయ్యారు. తాను వివేకానంద రెడ్డి దారుణ హత్య గురించి మాట్లాడానని.. కానీ, వైసీపీ నాయకులు తాను ఆస్తుల కోసం రాజకీయం చేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. కానీ.. వాస్తవానికి ఆస్తుల కోసం తాను రాజకీయం చేయట్లేదని స్పష్టం చేశారు. తనకు ఆస్తులు అజెండా ఏమాత్రం కాదని తెలిపారు. అంతేకాదు... ఇటీవల జగన్, షర్మిలల మాతృమూర్తి విజయమ్మ రాసిన నోటరీ అఫిడవిట్ లేఖపై జగన్కు సమాధానం చెప్పే దమ్ములేదని విమర్శించారు. అందుకే నేతలతో(రాచమల్లు శివప్రసాద్రెడ్డి మీడియా సమావేశం) మాట్లాడిస్తున్నారని షర్మిల విమర్శించారు.
వైసీపీ సైతాన్లు, కుక్కలు
ఈ సందర్భంగా వైసీపీ నేతలను మరోసారి షర్మిల తీవ్రంగా దూషించారు. వైసీపీ నాయకులు సైతాన్లు, కుక్కలు మొరుగుతు న్నట్టు మొరుగుతున్నారు.. అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాను మాట్లాడింది బాబాయి కుమార్తె, సొంత సోదరి సునీతకు న్యాయం జరగాలనేనని తెలిపారు. కానీ, దీనిని వక్రీకరించి.. ఆస్తుల గురించి మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ``ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ మాత్రమే. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం అవుతుంది అని భ్రమలో ఉన్నారు. కానీ నిజం ఎప్పడు దాగదు. అబద్ధాన్ని నిజం అని చెప్పాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు.`` అని షర్మిల వ్యాఖ్యానించారు.
వివేకా హత్య ను అవినాష్ రెడ్డి(కడప ఎంపీ) తప్పుదారి పట్టించారని, గుండెపోటు కట్టుకథ అవినాష్ సృష్టేనని షర్మిల అన్నారు. అంతేకాదు.. ఇదే గుండెపోటు కట్టుకథ ను సునీత మీద నెట్టాలని చూశారని మండిపడ్డారు. ఇదే నిజాన్ని ఆ రోజు ప్రెస్ మీట్ లో తాను చెప్పానన్న ఆమె.. వైసీపీ మాత్రం తమ మాటలను వక్రీకరించి ఆస్తులు అంటోందని తెలిపారు. వివేకా హత్య మీద సమాధానం చెప్పే దమ్మువైసీపీకి కానీ.. జగన్కు కానీ లేదని అన్నారు. ``ఉదయం 7 గంటల నుంచి వివేకా గుండెపోటు అని సాక్షిలో ఎందుకు నడిపారో ఇప్పటికీ చెప్పలేదు. నిజం ఏంటో చెప్పాల్సింది జగన్ , భారతిలు మాత్రమే. వీళ్ళు చెప్పలేక నా మీద అపనిందలు వేస్తున్నారు`` అని అన్నారు.
నా పోరాటం వేరు!
తన పోరాటం ఆస్తుల గురించి కాదని షర్మిల స్పష్టం చేశారు. తాను, సునీత సీఎం చంద్రబాబుతో చేతులు కలిపినట్టు సృష్టిస్తున్నారని.. కానీ, వాస్తవం కాదన్నారు. తన పోరాటం అంతా.. బాబాయి కుమార్తెగా, తన సోదరిగా సునీతకు న్యాయం జరగాలేననేని తెలిపారు. ``ఆస్తులే నాకు ముఖ్యం అనుకుంటే నేను తెలంగాణలో పార్టీ పెట్టే పరిస్థితి లేదు. ఆస్తుల కోసం కోర్టుకి వెళ్ళింది నేను కాదు. MOUను నేను బహిర్గత పరచలేదు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ గా మారాల్సిన అవసరం లేదు. జగన్ లాగా నాకు స్వార్థ రాజకీయాలు తెలియదు. వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దుస్థితి నాకు పట్టలేదు.`` అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
వైఎస్ ఆశయాల కోసమే..
తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసమే తాను ఉన్నానని.. అందుకే రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల తెలిపారు. రాజకీయాల కోసం బీజేపీకి దత్త పుత్రుడు(జగన్)గా తాను మారలేదని అన్నారు. విజయమ్మ తన లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారని, ఆస్తులు సగభాగం అని చెప్పారని.. నలుగురు మనుమలకు సమానంగా ఆస్తి పంపిణీ జరగాలని చెప్పారని ఇది.. రాజశేఖరరెడ్డి ఆదేశమని కూడా విజయమ్మ తెలిపారని పేర్కొన్నారు. తాను రాసింది దేవుడి సాక్షిగా నిజమే అని కూడా విజయమ్మ స్పష్టం చేశారని తెలిపారు. ఆస్తుల విషయంలో గోబెల్స్ ప్రచారం చేయొద్దని విజయమ్మ కోరారని పేర్కొన్నారు. కానీ, విజయమ్మ లేఖ ను కూడా ఫేక్ అంటున్నారని, లెటర్ మీద విజయమ్మ సంతకం పెట్టలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
విజయమ్మను ఇంటర్వ్యూ చేయండి!
తాజాగా విజయమ్మ రాసిన లేఖపై అనుమానాలు ఉంటే.. జగన్ తన సొంత మీడియా సాక్షి విలేకరిని పంపించి విజయమ్మను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా.. అని షర్మిల నిలదీశారు. కానీ, అలా చేయలేదని.. అంటే లేఖ నిజమే కదాఅని వ్యాఖ్యానించారు. విజయమ్మ.. సొంత తల్లి రాసిన లేఖ మీద జగన్ కి సమాధానం చెప్పే దమ్ములేక.. వైసీపీ కుక్కలతో మొరిగిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ విశ్వసనీయత కోల్పోయాడని వ్యాఖ్యానించారు.