ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి(amaravati)ని పేర్కొంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 6 గంటల వరకు ఏకబిగిన 7 గంటల పాటు సాగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అమరావతిపై తమ తమ అభిప్రాయాలు స్పష్టం చేశారు. ఇదేసమయంలో వైసీపీ పాలన.. నాడు అమరావతి రైతులను వేధించిన తీరును కూడా కళ్లకు కట్టేలా వివరించారు. రాజధాని లేని రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి వరకు జరిగిన పరిణామాలను ఇతర సభ్యులు కూడా సభలో పేర్కొన్నారు. అనంతరం.. సభ ఏకగ్రీవంగా అమరావతిపై తీర్మానాన్ని ఆమోదించింది.
ఇదీ తీర్మానం..
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ -5లో పేర్కొన్న `ఏ క్యాపిటల్` స్థానంలో `ఎట్ క్యాపిటల్`గా పేర్కొననున్నారు. ఈ మేరకు తీర్మానం(resolution)లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అదేవిధంగా ``అమరావతితోపాటు క్యాపిటల్ ఏరియా ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం-2014లో చేర్చాలి`` అని పేర్కొన్నారు. మొత్తగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్-5 లో సరవణ చేయాలని ప్రతిపాదించారు.
కేంద్రానికి ఎలా..
రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఈ తీర్మానాన్ని తొలుత గవర్నర్ అబ్దుల్ నజీర్కు పంపిస్తారు. ఆయన దీనిపై రాజముద్ర వేసి.. కేంద్ర హోం శాఖ(central home ministry)కు పంపిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం 6-12 గంటల సమయం పడుతుంది. అనంతరం.. కేంద్ర హోం శాఖ దీనినిమళ్లీ న్యాయశాఖకు పంపిస్తుంది. అనంతరం.. న్యాయశాఖ పరిశీలించి.. దీనిపై అభ్యంతరాలకు గడువు ఇస్తుంది. దీనిని నేరుగా మళ్లీ రాష్ట్రానికే పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తుంది. అయితే.. ఇది నామమాత్రపు ప్రక్రియే. అసెంబ్లీ తీర్మానమే ఫైనల్. దీంతో ప్రజల అభ్యంతరాలకు ప్రాతిపదిక లేదు.
అనంతరం.. దీనిపై బిల్లు చేస్తారు. దీనిని కేంద్ర న్యాయశాఖ చేయనుంది.(గతంలో న్యాయశాఖే కొన్నిఅభ్యంతరాలు చెప్పడంతో ఇప్పుడు తీర్మానం చేయాల్సి వచ్చింది.) అనంతరం.. పార్లమెంటు లోక్సభలో ప్రవేశపెడతారు. ఎందుకంటే..విభజన చట్టం ఆమోదం పొందింది.. లోక్సభలోనే కాబట్టి.. అక్కడే తొలుత ప్రవేశ పెడతారు. అనంతరం.. దీనిని ఆమోదం పొందినట్టుగా పేర్కొంటూ.. రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో ఉన్న రాజధానుల జాబితాలో అమరావతి చేరనుంది. అయితే.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు నిర్దిష్ట గడువు లేకపోయినా.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి కారణంగా.. రెండు మాసాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.