దశాబ్ద కాలానికి పైగా సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్వీన్ గా వెలుగొందుతున్న త్రిష(Trisha), తన కెరీర్ విషయంలో తీసుకోబోయే ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కుర్ర హీరోల నుంచి సీనియర్ స్టార్ల వరకు అందరి సరసన నటిస్తూ, సెకండ్ ఇన్నింగ్స్లోనూ తిరుగులేని ఫామ్లో ఉన్న ఈ అందాల భామ.. త్వరలోనే వెండితెరకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్త ఆమె అభిమానులను ఆందోళనలో పడేసింది.
త్రిష ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్న సంగతి తెలిసిందే. విజయ్తో త్రిషకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో, ఆమె ఆ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారని టాక్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ వేస్తున్న అడుగుల్లో త్రిష తోడుగా నిలవాలని, అందుకే నటనకు స్వస్తి చెప్పి స్టార్ క్యాంపెయినర్గా మారాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా త్రిష చేతిలో ఎప్పుడూ అరడజను సినిమాలు ఉండేవి. కానీ, గత కొంతకాలంగా ఆమె కొత్త కథలేవీ వినడం లేదని, ఏ కొత్త ప్రాజెక్టుపై సంతకం చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర' జూలై 10న విడుదల కానుంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, తెలుగులో త్రిషకు ఇదే చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది. అలాగే సూర్యతో కలిసి నటించిన 'కరుప్పు' మే 14న విడుదల కాబోతోంది.
తన కెరీర్, రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఈ వార్తలపై త్రిష ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, మే నెలలో విడుదల కానున్న 'కరుప్పు' ప్రమోషన్ల సమయంలో కానీ, 'విశ్వంభర'(Vishwambhara) ఈవెంట్లలో కానీ ఆమె తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవైపు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆమె ఫ్యాన్స్కు మింగుడుపడని విషయమే అయినప్పటికీ, పొలిటికల్ ఎంట్రీ కోసం ఆమె సిద్ధమవుతున్నారనే వార్త మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.