దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.. రాత్రి 8 దాటితే అంతా బంద్!

admin
Published by Admin — April 07, 2026 in International
News Image

ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌(Pakistan) మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ కఠినమైన ఆంక్షలను ప్రకటించారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా రాత్రి 8 గంటలకే వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెరిగిపోతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపు చేసి, ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడమే ఈ స్మార్ట్‌ లాక్‌డౌన్ ప్రధాన ఉద్దేశం.

పాక్(Pak) సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పంజాబ్, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ వంటి అన్ని ప్రధాన రాష్ట్రాల్లో తక్షణమే అమలులోకి రానుంది. ఈ నిబంధనల ప్రకారం.. షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే బజార్లు రాత్రి 8 గంటలకల్లా మూతపడాలి. ఒకప్పుడు అర్థరాత్రి వరకు వెలుగులతో కళకళలాడే పాకిస్థాన్ వీధులు, ఇప్పుడు రాత్రి 8 దాటగానే నిర్మానుష్యంగా మారనున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి పౌరుడు ఈ నిబంధనలకు సహకరించాలని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

అయితే, నిత్యావసరాలు, ప్రజల కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మినహాయింపులు ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలతో పాటు కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటల వరకు నిర్వహించుకోవచ్చు. ఇళ్లలో జరిగే ప్రైవేట్ వేడుకలకు కూడా రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరడం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు, ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమకు, ఈ సమయ పరిమితులు కోలుకోలేని దెబ్బ తీస్తాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.

Tags
Pakistan Economic Crisis Energy Crisis Pakistan News Shehbaz Sharif Lockdown
Recent Comments
Leave a Comment

Related News