ప్రపంచ బ్యాంకు(world Bank) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(cm chandrababu)తో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ఈ బృందం ప్రశంసించింది. ``సూపర్ సర్.... అమరావతికి మంచి ఫ్యూచర్ ఉంది.`` ప్రతినిధి బృందం సభ్యులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ-విద్యుత్ రంగ సంస్కరణల వల్ల ఈ నగరం భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ప్రపంచ బ్యాంకు బృందం అభిప్రాయపడింది. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వెల్లడించింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యాకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్టు బృంద ప్రతినిధులు ముఖ్యమంత్రితో చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతోపాటు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా తాము పని చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ బృందానికి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. కాగా.. ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణానికి 15000 కోట్లు రుణంగా అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలించేందుకు బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి పనుల తీరును గమనిస్తున్నారు. నివేదికలు తీసుకుంటున్నారు. ఆ తర్వాతేనిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులను విడుదల చేయడానికి ముందు(ఏప్రిల్-మే) ప్రతినిధి బృందం ఇక్కడ పర్యటించడం గమనార్హం.
రహదారులతో ఆదాయం!
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలన్నారు.