రాజకీయాల్లో ఏనాటి పాపం ఏ రూపంలో వెంటాడుతుందో ఎవరూ ఊహించలేరు. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) విషయంలో ఇదే ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఎప్పుడో పదేళ్ల క్రితం రాజకీయ మైలేజ్ కోసం చేసిన ప్రయత్నం, ఇప్పుడు ఆయన మెడకు జైలు శిక్ష అనే ఉరితాడుగా చుట్టుకుంది. విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో ఒక్కసారిగా ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మొదలైంది. ఒకప్పుడు పవర్ ఫుల్ మినిస్టర్గా వెలిగిన నాయకుడికి, ఇలా పాత కేసులో శిక్ష పడటం ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలు కథేంటంటే.. 2016లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విభజన సెగలు కక్కుతున్న వేళ, విశాఖకు రైల్వే జోన్ కావాలంటూ అమర్నాథ్ నిరసన బాట పట్టారు. గాంధీ విగ్రహం సాక్షిగా నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఆమరణ నిరాహార దీక్ష అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఈ క్రమంలో ఆయన ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులు పెట్టిన కేసు.. ఎనిమిదేళ్లుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంది. తీరా ఇప్పుడు విచారణ పూర్తయ్యాక, అమర్నాథ్ దోషి అని తేలడమే కాకుండా.. ఆరు నెలల జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ప్రస్తుతం ఈ తీర్పు వైసీపీ(YCP) శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "ప్రజా ప్రయోజనం కోసం చేసిన పోరాటాన్ని ఆత్మహత్యాయత్నంగా ఎలా చూస్తారు?" అంటూ అమర్నాథ్ వర్గీయులు వాదిస్తున్నారు. పై కోర్టులో అప్పీలుకు వెళ్తామని ఆయన ప్రకటించినప్పటికీ, దోషి అనే ముద్ర పడటం రాజకీయంగా ఆయన ప్రత్యర్థులకు బలమైన ఆయుధంగా మారింది. పదేళ్ల క్రితం నాటి వేడి మళ్ళీ ఇప్పుడు అమర్నాథ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరి హైకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా? లేక ఆరు నెలల జైలు వాసం తప్పదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.