కాలం మహా చిత్రమైంది. ఎప్పుడూ ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో అస్సలు ఊహించలేనట్లుగా వ్యవహరించే తీరు కాలానికి మాత్రమే ఉంటుంది. శత్రువుల్ని ప్రాణమిత్రులుగా మార్చే శక్తియుక్తి కాలానికే. దీనికి తోడు మిగిలిన రంగాలకు భిన్నంగా ఏదైనా సాధ్యమే అన్నట్లుగా ఉంటుంది రాజకీయాల్లో పరిస్థితులు.. పరిణామాలు. తాజాగా అలాంటి సీన్ ఇప్పుడు అందరూ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేస్తోంది.
ఒకప్పుడు తాను సవాలు చేసిన వ్యక్తే.. స్వయంగా తన సీఎం పదవిని ఇవ్వటం చూస్తే కాలమహిమ కాక మరేంటి? అనుకోకుండా ఉండలేం.
బిహార్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమ్రాట్ చౌదరి గతంలో బిహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా వ్యవహరించిన నితీశ్ కుమార్ ను సీఎం గద్దె నుంచి దింపుతానని శపథం చేశారు. అప్పుడు ప్రత్యర్థిగా చేసిన సవాలు.. ఇప్పుడు స్నేహపూర్వక ఒప్పందంలో సాధ్యమైంది. నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించే వరకు తాను ధరించిన తలపాగా తీయనని బీజేపీ నేత సమ్రాట్ చౌదరి 2023లో ఒక శపథం చేశారు.
ఆ మేరకు కాషాయ రంగు తలపాగా ధరించారు. అయితే.. 2024లోజేడీయూ - బీజేపీ కూటమిగా ఏర్పడటంతో సమ్రాట్ చౌదరి తన శపథాన్ని వీడిరాు. ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన తర్వాత 2024 జులైలో తన తలపాగాను తీసి అయోధ్యలో శ్రీరాముడికి సమర్పించారు. కూటమికి గౌరవమిస్తూ శపథాన్ని వీడుతున్నట్లుగా అప్పట్లో ప్రకటించారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కూటమి ప్రభుత్వానికి గౌరవమిస్తూ శపథాన్ని వీడుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. సమ్రాట్ చౌదరి అనుకున్నదే నిజమైంది. తానుచేసిన సవాలును ఆయన సాధించినట్లుగా బిహార్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి సాధ్యం కాని ఆయన విజయం ఏమంటే.. తాను ఎవరి మీదనైతే సవాలు విసిరారో.. ఆయనే స్వయంగా తన సీఎం పదవిని సమ్రాట్ చౌదరికి ఇచ్చేయటం. 57 ఏళ్ల సమ్రాట్ చౌదరిని బిహార్ సామ్రాట్ గా మారారు.
ఇతడి బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. సమ్రాట్ చౌదరి తండ్రి శకుని చౌదరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమ్రాట్ తల్లి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. తొలుత ఆర్జేడీ.. జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో పని చేసి 2017లో బీజేపీలో చేరారు. లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2023 మార్చి నుంచి 2024 జులై వరకు బిహార్ బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయన.. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ లో బీజేపీని ముందుండి నడిపించారు. చివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా.. తాను శపథం చేసిన నితీశ్ స్వయంగా తన సీఎం పదవిని అప్పగించేలా చేయటం ఆయనరాజకీయ జీవితంలోమర్చిపోలేని మధురానుభూతిగా చెప్పాలి.