తెలంగాణ రాష్ట్ర సేన(telangana rashtra sena)గా తన పార్టీని ప్రకటించిన కవిత(kavita).. సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాదాపు 59 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమం నుంచి నాటి కెసిఆర్(kcr) పాలన, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాకా అనేక అంశాలను ఆమె వివరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా పాంచ జన్యం పేరుతో ఐదు హామీలను కూడా ప్రకటించారు.
అయితే కవిత కొత్త పార్టీ సహా ఆమె ప్రకటించిన హామీలు గత ప్రభుత్వం పైన ప్రస్తుత ప్రభుత్వం పైన చేసిన విమర్శలు వంటి విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీతో సహా నెటిజెన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాన్ని చూస్తే సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. పళ్ళు తోముకునే కోల్గేట్ పేస్ట్ సహా బిస్లరీ వాటర్ బాటిల్ ను సోషల్ మీడియాలో పెట్టి కవిత పై పరోక్షంగా విమర్శలు చేసింది.
`నకిలీ ప్రొడక్టు వాస్తవ ప్రోడక్ట్` పక్క పక్కన పెట్టి అసలు అసలే నకిలీ నకిలీనే అంటూ కామెంట్ చేయడం విశేషం. అంటే బిఆర్ఎస్ దృష్టిలో కవిత పెట్టిన పార్టీ నకిలీది అనే ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడిన టిఆర్ఎస్(trs) ను అదే పేరుతో తెలంగాణ రాష్ట్ర సేనగా మార్చడాన్ని నకిలీగా పేర్కొనడం విశేషం. అంతేకాదు గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టిన షర్మిల ఫోటోను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సేనను ప్రారంభించిన కవిత ఫోటోను పక్క పక్కనపెట్టి కూడా ట్రోల్ చేయడం మరింత ఆసక్తిగా మారింది.
గతంలో షర్మిల వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినప్పుడు ఏ విధంగా అయితే మేక్ ఓవర్ అయ్యారో ఇప్పుడు కవిత కూడా అటువంటి శారీ కట్టు బొట్టుతోనే కనిపించారని పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఇక, నెటిజన్ల విషయానికి వస్తే.. కొంతమంది `కవితక్కకు జై` అని కామెంట్లు పెట్టగా.. మెజారిటీ నెటిజెన్లు మాత్రం సూటిపోటి వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు.
`మీకు బీఆర్ఎస్ లో పదవులు ఇచ్చి ఉంటే ఇప్పుడు పార్టీ పెట్టే అవసరం ఉండేది కాదు కదా` అని ఎక్కువ మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. అదేవిధంగా.. ప్యాకేజీ కుదరకపోవడం వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఇలా నెటిజన్లు సైతం కవిత వ్యాఖ్యలపైన స్పందించడం విశేషం.
ఇక `పాంచ జన్యం` పేరుతో కవిత ప్రకటించిన హామీలపై కూడా కొందరు పెదవి విరిచారు. ఇవి ఎప్పటినుంచో వినిపిస్తున్నవేనని వీటిలో కొత్త ఏమీ లేదని పేర్కొనడం గమనార్హం. మరికొందరు మాత్రం ``అక్క వచ్చినప్పుడు చూద్దాంలే. ఇవన్నీ అయ్యేవా పెట్టావా` అని లైట్ తీసుకున్నారు. ఇవీ కవితకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న విషయాలు.