సినిమా వెండితెరపై కూడా చూడని ఒక అద్భుత ప్రేమకావ్యం మధ్యప్రదేశ్లో ఆవిష్కృతమైంది. ఖాకీ డ్రెస్సులో కఠినంగా కనిపించే అధికారిణి మనసు.. ఓ జీవిత ఖైదీ(Prisoner) ప్రేమలో పడింది. సమాజం ఏమనుకున్నా, కుటుంబం వ్యతిరేకించినా.. తన మనసు మెచ్చిన వాడి కోసమే ఆమె ఏడడుగులు వేసింది. జైలు గోడల మధ్య చిగురించిన ఈ అరుదైన బంధం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని సత్నా సెంట్రల్ జైలు ఈ వింత ప్రేమకథకు వేదికైంది. అక్కడ డిప్యూటీ జైలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిరోజా ఖాతూన్కు, అదే జైలులో ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర (అభిలాష్)తో పరిచయం ఏర్పడింది. సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ శిక్షా కాలంలో వారి మధ్య మాటలు పెరిగి, అది కాస్తా గాఢమైన అనురాగంగా మారింది. నేరం చేసిన వ్యక్తిలో కలిగిన పరివర్తనను ఆమె గమనించగా, ఆమెలోని మానవత్వాన్ని అతడు ప్రేమించాడు.
శిక్షా కాలం ముగిసి 2020లో ధర్మేంద్ర బయటకు వచ్చాక, వీరి బంధం మరింత బలపడింది. అయితే వీరిద్దరి మధ్య మతం, సామాజిక హోదా అనే పెద్ద గోడలు అడ్డుగా నిలిచాయి. ఫిరోజా ముస్లిం కుటుంబానికి చెందిన వారు కాగా, ధర్మేంద్ర హిందూ మతానికి చెందిన వ్యక్తి. దీనికి తోడు ఒక అధికారిణిగా ఉండి మాజీ ఖైదీని పెళ్లి చేసుకోవడంపై ఫ్యామిలీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ, వాటన్నింటినీ పక్కనపెట్టి.. ఇటీవల లవ్కుష్ నగర్(Lovekush Nagar)లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యారు.
"జీవితం మాది.. నిర్ణయం కూడా మాదే" అంటూ ఫిరోజా ఖాతూన్(Firoza Khatun) తన పెళ్లిపై స్పష్టతనిచ్చారు. 14 ఏళ్ల జైలు జీవితం తర్వాత ధర్మేంద్రకు ఆమె ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నిబద్ధత గల అధికారిణిగా ఉంటూనే, ఒక మనిషిలోని మార్పును గౌరవించి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రేమకు ఏ హద్దులు ఉండవని వీరు మరోసారి నిరూపించడంతో నెటిజన్లు ఈ జంటను అభినందిస్తున్నారు.