పోక్సో కేసు విచారణ విషయంలో కేంద్ర సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు భారీ ట్విస్టు ఇచ్చారు. ఈ కేసు విచారణకు రావాలంటూ.. పోలీసులు ఆయన మేనమామకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం భగీరథ్ కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కురావాల్సి ఉంది. ఆయన వస్తాడని భావించిన పోలీసులు ప్రశ్నలతో రెడీ అయ్యారు. ఒకవైపు ఈ కేసులో బాధిత బాలిక వాంగ్మూలాన్ని కూడా సేకరించిన అధికారులు భగీరథ్ను కూడా అన్ని కోణాల్లో విచారించేందుకు రెడీ అయ్యారు.
కానీ, భగీరథ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలీసులకు కనిపించలేదు. కనీసం ఆచూకీ కూడా ఇవ్వలేదు. విచారణకు కూడా రాలేదు. ఈ పరిణామాలనేపథ్యంలో అనూహ్యంగా సాయంత్రం 7 గంటల సమయంలో పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ వచ్చింది. దీనిలో ఆయన.. తనకు వ్యక్తిగత కారణాలతో కుదరలేదని.. అందుకే బుధవారం నాటి విచారణకు రాలేక పోయానని చెప్పారు. మరో రెండు మూడు రోజుల సమయం కావాలని కోరారు. మరో డేట్ ఫిక్స్ చేస్తే.. అప్పుడు విచారణకు వస్తానని చెప్పారు. అప్పటిలోగా తనకు సంబంధించిన వివరాలను సేకరిస్తానని తెలిపారు. దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
సర్వత్రా నిరసనలు..
భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. పోక్సో కేసు నమోదైన నిందితుడిని ముందు అరెస్టు చేయాల్సిందేనని చట్టం చెబుతుండగా.. పోలీసులు ఆయనకు సహకరిస్తున్నారని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కనపడట్లేదు అంటూ మెట్రోలో పోస్టర్లతో ప్రచారం చేశౄరు. ``మీకు కనిపిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు చెప్పండి`` అంటూ హైదరాబాద్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
ఇక, సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి సైతం భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా సంఘాలు కూడా రోడ్డెక్కాయి. పోక్సో కేసులో బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో వారిని సముదాయించలేక, సమాధానం చెప్పలేక పోలీసులు ఇబ్బందిపడ్డారు.