సోషల్ మీడియా క్రేజ్ను రాజకీయ వేదికలపై ఎలా ఉపయోగించుకోవాలో ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియదేమో! భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య సంబంధాల సంగతి పక్కన పెడితే.. ఇరు దేశాల ప్రధానులైన మోదీ, జార్జియా మెలోనిల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇంటర్నెట్ను ఊపేస్తోంది. వీరిద్దరి పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘మెలొడీ’ (Melodi) అనే ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా తన ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీ ఈ ట్రెండ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్(Rome) నగరంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోని ఘన స్వాగతం పలికారు. అయితే, ఈ అధికారిక కలయికలో అందరినీ ఆశ్చర్యపరిచింది మోదీ తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. భారత్లో దశాబ్దాలుగా ఫేమస్ అయిన ‘పార్లే మెలొడీ’ చాక్లెట్ ప్యాకెట్ను ఆయన మెలోనికి కానుకగా ఇచ్చారు.

ఈ క్రేజీ గిఫ్ట్ అందుకున్న తర్వాత ప్రధాని మెలోని మురిసిపోతూ ఒక చిన్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. "బహుమతికి చాలా థాంక్స్" అంటూ ఆమె క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోలో మెలోని మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ(PM Modi) నాకోసం చాలా టేస్టీ టోఫీలు తెచ్చారు" అని అనగానే, పక్కనే ఉన్న మోదీ అంతే చిరునవ్వుతో ‘మెలొడీ’ అని గుర్తుచేశారు. ఈ క్యూట్ అండ్ ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షకు పైగా లైకులు, వేల సంఖ్యలో కామెంట్లతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
ఈ పర్యటనలో కేవలం చాక్లెట్ ముచ్చట్లే కాదు, ఇరు దేశాల బంధాన్ని బలపరిచే కీలక పరిణామాలు కూడా జరిగాయి. మోదీ, మెలోని(Meloni) ఇద్దరూ కలిసి ఒకే కార్లో ప్రయాణిస్తూ రోమ్ నగర వీధుల్లో సందడి చేశారు. ఆ తర్వాత రాత్రి వేళ ఇటలీ చారిత్రక కట్టడం కొలోసియంను సందర్శించారు. అక్కడ నడుస్తూ ఇరు దేశాల వ్యూహాత్మక మైత్రిని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.