కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు భారీ కుదుపు చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) తన పదవికి రాజీనామా చేశారు. హైకమాండ్ ఫార్ములాలో భాగంగానో, లేక అంతర్గత ఒప్పందాల వల్లో కానీ.. మొత్తానికి సిద్ధరామయ్య సీఎం కుర్చీ నుంచి దిగిపోవడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్గా మారింది.
తన రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సిద్ధరామయ్య అధికారికంగా సమర్పించారు. అయితే, ఈ కీలక పరిణామం వెనుక అసలు ట్విస్ట్ ఏంటంటే.. సిద్ధరామయ్య రాజీనామా చేసే సమయంలో ఆయన వెంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఉండటం విశేషం. ఇద్దరు అగ్రనేతలు కలిసి వెళ్లి రాజీనామా సమర్పించడంతో కర్ణాటక(Karnataka) పీఠంపై తదుపరి కూర్చోబోయేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది.
సిద్ధరామయ్య తప్పుకోవడంతో ఇక కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయింది. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న డీకేకు ఈసారి సీఎం పీఠం దక్కబోతుండటంతో ఆయన అనుచరులు, అభిమానులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. అయితే, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియ ముగిసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. మొత్తానికి సిద్ధరామయ్య రాజీనామాతో కన్నడ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. మరి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలతో ముందుకు సాగుతారో చూడాలి.