ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంలో ఈడీ జరుపుతున్న దర్యాప్తు.. వైసీపీ అగ్రనేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గురువారం నాడు హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయన మూడోసారి హాజరుకావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భారీ దోపిడీపై కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నిస్తూ, ఇరుకున పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కేసులో అసలు ట్విస్ట్ ఎక్కడ మొదలైందంటే.. గత నెలలో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) నివాసాలు, కార్యాలయాలపై జరిగిన ఏకకాల సోదాలే. ఆ సమయంలో ఈడీ చేతికి చిక్కిన షెల్ కంపెనీల బ్యాంక్ స్టేట్మెంట్లు, రహస్య లావాదేవీల డైరీలు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారాయి. మద్యం పాలసీని మార్చి, కొన్ని నిర్దిష్ట కంపెనీలకే దోచిపెట్టడం ద్వారా వచ్చిన వందల కోట్ల కిక్బ్యాక్లను రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా మళ్లించారనే దానిపై ఈడీ పక్కా ఆధారాలతో ఆయన్ను నిలదీస్తోంది.
విజయసాయిరెడ్డి చుట్టూ దర్యాప్తు తిరుగుతున్నప్పటికీ, తెరవెనుక ఉన్న ఇద్దరు కీలక నేతల అరెస్టులు త్వరలోనే ఖాయమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. ఇందుకు ప్రధాన కారణం.. విచారణలో సాయిరెడ్డి ఇచ్చిన సంచలన స్టేట్మెంట్లేనని తెలుస్తోంది.ఈ లిక్కర్ డీలింగ్స్తో తనకు నేరుగా సంబంధం లేదని, అంతా రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డే(Mithun Reddy) నడిపించారంటూ ఆయన ఈడీ ఎదుట లీకులు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరడం వల్లే తాను కేవలం రూ. 100 కోట్ల సర్దుబాటుకు మధ్యవర్తిత్వం వహించానని సాయిరెడ్డి పేర్కొనడం వైసీపీ కోటరీని షేక్ చేస్తోంది.
ఈ లీలా డిస్టిలరీస్, ఈశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వంటి సంస్థల ద్వారా సాగిన మనీలాండరింగ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు ఈడీ దాదాపు తేల్చేసింది. సాయిరెడ్డి(Sai Reddy) ఇచ్చిన సమాచారంతో ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆ ఇద్దరు పెద్దల అరెస్టుకు కౌంట్డౌన్ ప్రారంభమైందని ఢిల్లీ వర్గాల టాక్.