మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం, దానికి అధినేత చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ్ముళ్లలో కొత్త జోష్ వచ్చింది. అయితే, ఈ 33 శాతం ఫార్ములాను 2029 ఎన్నికల వరకు కాకుండా, ఇప్పుడే అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందనే సరికొత్త చర్చ పార్టీ అంతర్గత వర్గాల్లో ఊపందుకుంది. ఈ క్రమంలోనే జూన్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. సంఖ్యాబలం ప్రకారం ఇందులో మూడు సీట్లు టీడీపీ(TDP) ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడింట్లో ఒకటి ఎలాగూ సానా సతీష్కు దాదాపు ఖరారైనట్లే అనే ప్రచారం సాగుతోంది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒకదానిని మహిళా కోటా కింద కేటాయించి, మహానాడు తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చాటిచెప్పాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అదే కనుక నిజమైతే, టీడీపీ తరపున ఢిల్లీకి వెళ్లే ఆ లక్కీ లేడీ ఎవరనే సస్పెన్స్ ఇప్పుడు మొదలైంది.
గతంలో టీడీపీ తరపున తోట సీతామహాలక్ష్మి, గుండు సుధారాణి, జయప్రద, రేణుకా చౌదరి వంటి సీనియర్ మహిళా నేతలు రాజ్యసభలో అడుగుపెట్టి తమ ముద్ర వేశారు. కానీ, ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో మహిళలకు పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ బ్యాలెన్స్ను బేరీజు వేసుకుంటూ కోస్తా లేదా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ లేదా యాక్టివ్ మహిళా నేతకు ఈ జాక్పాట్ దక్కేలా లైన్ క్లియర్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి మహానాడు(Mahanadu) సెంటిమెంట్ను గౌరవిస్తూ బాబు-లోకేష్లు తీసుకోబోయే ఈ నిర్ణయంతో లక్కీ ఛాన్స్ కొట్టేసే ఆ లేడీ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.