మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఖాయంగా గెలుస్తుందనుకున్న రాజ్యసభ సీటు కాస్తా కాంగ్రెస్ చేజారిపోయింది. ఈ స్థానం నుండి పోటీకి నిలిచిన కాంగ్రెస్ ఫైర్బ్రాండ్ నేత, మాజీ ఎంపీ మీనాక్షీ నటరాజన్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కోలుకోలేని దెబ్బ తగిలింది. నామినేషన్ తిరస్కరణపై న్యాయం చేయాలంటూ ఆమె పెట్టుకున్న ఆఖరి ఆశలను సుప్రీంకోర్టు పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ వివాదంపై దాఖలైన అత్యవసర పిటిషన్ను విచారించేందుకు కోర్టు నిర్ద్వంద్వంగా నిరాకరించింది.
అసలు కథ ఎక్కడ అడ్డం తిరిగిందంటే... రాజ్యసభ ఎన్నికల రేసులో నిలిచిన మీనాక్షి(Meenakshi Natarajan), తన నామినేషన్ పత్రాల్లో ఒక కీలక సమాచారాన్ని దాచారనే ఆరోపణలు వచ్చాయి. ఆమెపై ఉన్న ఒక పాత కేసు వివరాలను అఫిడవిట్లో పొందుపరచలేదన్న కారణంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను నిర్దాక్షిణ్యంగా పక్కనబెట్టేశారు. సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్కు ఈ సీటు దక్కడం నల్లేరుపై నడకే అనుకుంటున్న తరుణంలో.. ఈ షాక్తో పార్టీ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది.
రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, తనను ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మీనాక్షి సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు. కానీ న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకునేందుకు అస్సలు మొగ్గు చూపలేదు. "ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ప్రక్రియ మొదలయ్యాక తాము ఈ స్టేజ్లో ఎంటర్ కాలేము" అని స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది.
సుప్రీం తీర్పుతో మీనాక్షి నటరాజన్ రాజకీయ పోరాటానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అయితే కోర్టు సూచన మేరకు ఆమె తదుపరి ఉపశమనం కోసం ఎన్నికల సంఘాన్ని లేదా హైకోర్టును ఆశ్రయించే లోపే గ్రౌండ్ లెవెల్లో సీన్ రివర్స్ అయిపోయింది. మైదానంలో ప్రత్యర్థి లేకపోవడంతో.. బీజేపీ(BJP) అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించేసింది. ఒక్క అఫిడవిట్ లోపం.. గెలవాల్సిన సీటును ప్రత్యర్థి పళ్లెంలో పెట్టినట్లయింది.