ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయని, చిన్నపాటి వర్షానికి ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అందుకే, అమరావతి రాజధానిగా కాకుండా మావిగన్ ను జగన్ ప్రతిపాదించారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా,నిర్విరామంగా కొనసాగుతున్నాయని లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతల విష ప్రచారాన్ని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
"అమరావతిలో పనులు ఏమాత్రం ఆగడం లేదు. వర్షం కురిస్తే మునిగిపోయిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాజధానిలో ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇకనైనా విష ప్రచారాన్ని ఆపండి" అని ఆ వీడియో పోస్ట్ చేశారు. అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఈ వీడియోతో లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.