ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఖరీఫ్ సాగు కోసం అన్నదాతలు నాగలి పడుతున్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయంతో రైతులకు అండగా నిలిచింది. సాగు పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకుండా, ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి సంబంధించిన తదుపరి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేస్తోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం నిధుల జమ ప్రక్రియపై కసరత్తు ముమ్మరం చేసింది.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా సాగుతున్న ఈ పథకం ద్వారా, అర్హులైన ప్రతి రైతు(Farmer) కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు రూ. 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 14,000 మొత్తాన్ని జోడించి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి విడత కింద రూ. 7,000 రైతుల ఖాతాల్లో చేరగా, ఇప్పుడు రెండో విడత నిధులను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడుతున్న సమయంలో ఈ డబ్బులు చేతికి అందితే విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ఎంతో ఆసరాగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక కారణాలు లేదా డాక్యుమెంట్ల పొరపాట్ల వల్ల గత విడతలో ఎవరైనా నిధులు పొంది ఉండకపోతే, అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో, రైతు సేవా కేంద్రాల (RBK) ద్వారా డేటాను సరిచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇంకా ఈ పథకంలో నమోదు చేసుకోని వారు ఉంటే కొత్త దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.
మీకు ఎలాంటి ఆటంకం లేకుండా ‘అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava)’ సాయం అందాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోతే, వెంటనే మీ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ మరియు 1బీ పత్రాలతో స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలి. అక్కడి వీఆర్వో, తహసీల్దార్ల నిర్ధారణ అనంతరం మీ ఖాతా యాక్టివేట్ అవుతుంది. గత ఏడాది ఈ పథకం ద్వారా విజయవంతంగా లబ్ధి పొందిన రైతులకు ఎలాంటి సమస్యలు లేనందున, వారు మళ్లీ కొత్తగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
అలాగే ఒకప్పుడు ఆదాయపు పన్ను కట్టి, ప్రస్తుతం కట్టని వారు.. అలాగే ఈ-కేవైసీ(e-KYC) పెండింగ్ ఉన్నవారు తమ పత్రాలను పట్టుకుని వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్లి వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. ఇక ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న ఈ తరుణంలోనే రైతులందరూ తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు కోరుతున్నారు.