పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయింది. దీనికి కారణాలు ఏంటి? ఎందుకు ప్రజలు తిరస్కరించారు? అనే ఆత్మ విమర్శ కానీ.. ఆలోచన కానీ.. వైసీపీ అధినేత జగన్ ఇప్పటి వరకు చేయలేక పోయారని వైసీపీలోని కొందరు నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. పైగా.. తమ పాలన అత్యద్భుతంగా ఉందని.. ప్రజలు సుఖశాంతులతో జీవించారని కూడా ఆయన పదే పదే చెబుతున్నారు. పార్టీ నాయకులను పిలిచి మరీ గంటల కొద్దీ ఇస్తున్న ప్రసంగాల్లో.. సింహ భాగం.. గత పాలనపై స్వోత్కర్షలే కనిపిస్తున్నాయి. కానీ.. దీనివల్ల మాకు ప్రయోజనం లేదని చాలా మంది సీనియర్లే వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా..
రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మరోసారి జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు అయిపోయాయని చెప్పారు. రాష్ట్రంలోని టీడీపీ అవనీతి పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని అయన తెలిపారు. గత వైస్సార్సీపీ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారని వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడ వరం నియోజకవర్గ నాయకులు, సీనియర్ కార్యకర్తలతో జగన్ సుదీర్ఘ భేటీ నిర్వహించారు. అయితే.. ఈ సమయంలో సింహ భాగం.. గత వైసీపీ పాలనలోని `మంచి`నే చెప్పుకొచ్చారు. కానీ, ఎన్నికల్లో ఎందుకు ఓడామన్న విషయంపై ఆత్మ విమర్శ చేయలేక పోయారు.
ఏమన్నారంటే..
జగన్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గుర్తు చేశారు.
అంతకు ముందు కనీసం మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం అని.. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు
అని వివరించారు. అలాంటి మేనిఫోస్టోకు తామే విలువను తీసుకు వచ్చామని, 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. క్యాలెండర్ పెట్టుకుని మరీ వైస్సార్సీపీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.
ఏంటి ప్రయోజనం..
గతం చరిత్రను తవ్వి తీసుకుంటూ.. ఇంకా మేమే ముందున్నామని చెప్పుకోవడం వల్ల వైసీపీకి ఒరిగేది ఏమీ లేదన్న విషయా న్ని పార్టీ సీనియర్లు గుర్తు చేసుకుంటున్నారు. కానీ, జగన్ మాత్రం గుర్తించలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. గతం బాగుంటే.. 11 మంది ఎందుకు మిగిలారన్న దానికి సమాధానం లేదు. నిజానికి ఇప్పుడు రెండేళ్లయిన తర్వాత.. వైసీపీ భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలన్న విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. పోతున్న నాయకులు.. అచేతనంగా ఉన్న కేడర్పై పార్టీ దృష్టి పెట్టకుండా.. ఇంకా పాతవే నెమరు వేసుకునే పరిస్థితి ఉండడంపై సొంత నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.