ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తనపై కుల ముద్ర వేయవద్దని తన సొంత పార్టీ నేతలకు కూడా పవన్ విజ్ఞప్తి చేశారు. అయినా సరే పవన్ ను టార్గెట్ చేస్తూ ఆయనను కుల ప్రాతిపదికన విమర్శిస్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే పవన్ కు అండగా ఉండాలని మంత్రివర్గంలోని మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు.
పవన్ ను లక్ష్యంగా చేసుకుని ఏవైనా వివాదాలు సృష్టిస్తే వాటిని సమష్టిగా, బలంగా తిప్పికొట్టాలని తన కేబినెట్ సహచరులను ఆదేశించారు. నేరస్థులతో కలిసి వైసీపీ రాజకీయాలు చేస్తోందని, కర్నూలు ఘటనను ఉదాహరణగా చూపుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ను వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తే మంత్రులంతా ఐక్యంగా, గట్టిగా బదులివ్వాలని సూచించారు. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు.
వైసీపీ నేతల విమర్శలకు దీటుగా బదులివ్వాలని అన్నారుు. ఇక, మంత్రులు కేవలం తమ శాఖలకే పరిమితం కాకుండా, డీఎస్సీ వంటి ఇతర కీలక అంశాలపై కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. జొన్నగిరి గ్రామంలో స్వర్ణ ప్రాజెక్టులు ఉన్నందున ఆ గ్రామాన్ని 'స్వర్ణ గ్రామం'గా ప్రకటించాలని ప్రతిపాదించారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు.