కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ, డిప్యూటీ సీఎం హోదాలో పాలనలో తనదైన ముద్ర వేస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. తాజాగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి, పదవులు వచ్చిన తర్వాత కొందరు నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులపై ఆయన సీరియస్ అయ్యారు. విజయవాడ(Vijayawada) వేదికగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవన్ గట్టి క్లాస్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పదవులు వచ్చాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రజాప్రతినిధులకు తెగేసి చెప్పినట్లు సమాచారం. "ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు.. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఊరుకునేది లేదు" అంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు. నిరంతరం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతీ లీడర్ ప్రోగ్రెస్ గ్రాఫ్ను తనే స్వయంగా పర్యవేక్షిస్తానని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో మోసిన జనసైనికులు, వీరమహిళలను విస్మరిస్తే సహించే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ కరాఖండిగా చెప్పారు. పార్టీ(Janasena) కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు ప్రతీ ప్రజాప్రతినిధి అండగా నిలబడాలని, వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే షెడ్యూల్ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు తనకు చేరవేయాలని ఆర్డర్ వేశారు. పవన్ కల్యాణ్ పంథా చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పనితీరు మార్చుకోని నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనుకాడరనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.