ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరో భారీ సమరానికి శంఖారావం పూరిస్తోంది అధికార కూటమి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా చల్లారకముందే.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరో బిగ్ ఫైట్కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే స్థానిక పోరును ముగించేలా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇరుపక్షాల అసలైన బలాబలాలను తేల్చే అసలైన సమరంగా ఈ స్థానిక పోరు మారబోతోంది.
ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికల(AP Local Body Elections)కు ఈసారి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ల వరకు అన్ని స్థాయిల ఎన్నికలను ఒకే దఫాలో పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కూటమికి అత్యంత బలమున్న మున్సిపాలిటీలతో ఈ ఎన్నికల జాతరను ప్రారంభించి, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీలు, చివరగా పంచాయతీ ఎన్నికలతో ముగించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
స్థానిక పోరులో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కూటమి(NDA) పార్టీలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి. ఈ నెల 27 నుంచి దాదాపు 45 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, శ్రేణులు ప్రతి గడపనూ తట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ.. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ 45 రోజుల మిషన్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఎన్నికలు కూటమికి ఎంత ప్రతిష్టాత్మకమో.. విపక్ష వైసీపీకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో.. దీనిని తమ పాలనకు ప్రజామోదంగా చూపించాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భావిస్తోంది. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో తమకున్న బలమైన క్యాడర్ ద్వారా పుంజుకుని, సార్వత్రిక ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వైసీపీ(YCP) గట్టి పట్టుదలగా ఉంది. ఏదేమైనా, సెప్టెంబర్ నెలలో ఏపీ పాలిటిక్స్ పీక్స్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా సాగబోయే ఈ కురుక్షేత్రంలో గెలుపు కిరీటాన్ని ప్రజలు ఎవరికి తొడుగుతారో చూడాలి.