విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఓటరు నమోదును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డా. రాజా పిలుపునిచ్చారు.ఓటరు నమోదు ప్రక్రియలో ఎన్ఆర్ఐలు చురుకుగా పాల్గొని, 100 శాతం ఓటరు నమోదు లక్ష్యంగా కృషి చేయాలని ఆయన కోరారు.
ఓటు వేయడం ప్రతి భారతీయుడి రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత కూడా అని పేర్కొన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆన్లైన్ సేవలను వినియోగించుకుని ఎన్ఆర్ఐలు సులభంగా ఓటరు నమోదును పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. నమోదు సమయంలో చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, విదేశీ నివాస వివరాలు, భారతదేశంలోని శాశ్వత చిరునామా వంటి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ప్రజాస్వామ్య ప్రక్రియలోనూ అదే స్థాయిలో భాగస్వాములు కావాలని డా. రాజా అన్నారు. "మీ ఓటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ప్రతి అర్హత కలిగిన ఎన్ఆర్ఐ ఓటరు నమోదును పూర్తి చేసి ప్రజాస్వామ్యంలో తన బాధ్యతను నిర్వర్తించాలి" అని ఆయన పేర్కొన్నారు.