టాలీవుడ్(Tollywood) తెరపై 'లేడీ అమితాబ్' అనగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి పేరు విజయశాంతి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, స్టార్ హీరోలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఏకైక యాక్షన్ క్వీన్ ఆమె. అయితే, నేడు కోట్లలో పారితోషికం అందుకున్న ఈ స్టార్ నటి ప్రయాణం ఎంతో కష్టనష్టాలకోర్చి సాగింది. అసలు ఆమె కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఇండస్ట్రీని షాక్కు గురి చేస్తున్నాయి.
సినిమా రంగంలోకి అడుగుపెట్టే కొత్త నటీనటులకు మొదటి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. విజయశాంతి(Vijayashanti) విషయంలో కూడా ఇదే పునరావృతమైంది. ఆమెకు తొలిసారిగా వెండితెరపై అవకాశం వచ్చినప్పుడు నిర్మాతలు రూ. 5,000 పారితోషికం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమె చేతిలో పెట్టింది కేవలం రూ. 3,000 మాత్రమే. అదే ఆమె ఫస్ట్ రెమ్యునరేషన్. ఇక మిగిలిన డబ్బుల గురించి అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించి మోసం చేశారని స్వయంగా విజయశాంతినే ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
తొలి సినిమాలోనే పారితోషికంలో కోత పడటం, నిర్మాతలు చేతులెత్తేయడం లాంటి పరిణామాలు ఆమెను మానసికంగా కృంగదీసినా.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ చిన్నచూపును, మోసాన్ని అవమానంగా భావించకుండా తన కఠిన శ్రమకు, నటనకు మాత్రమే పదునుపెట్టారు. ఆ పట్టుదలే ఆమెను 'ప్రతిఘటన', 'నేటి భారతం', 'కర్తవ్యం', 'ఒసేయ్ రాములమ్మ(Osey Ramulamma)' లాంటి విప్లవాత్మక చిత్రాల వైపు నడిపించింది.
చివరకు ఎవరికైతే ఒకనాడు రెండు వేలు ఎగ్గొట్టారో, అదే ఇండస్ట్రీలో ఏకంగా రూ. కోటి పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్గా విజయశాంతి చరిత్ర సృష్టించారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ముగ్గురు టాప్ స్టార్స్ వీళ్లేనంటూ అప్పట్లో 'ఇండియా టుడే' మ్యాగజైన్ కవర్ పేజీపై బిగ్ బి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఫొటోలతో పాటు విజయశాంతి ఫొటోను ముద్రించడం ఒక సంచలనం. కాగా, సినిమాల్లో ఇటువంటి ఎన్నో సంచనాలను సృష్టించిన లేడీ సూపర్ స్టార్ ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.