రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అధికార మార్పిడి తర్వాత ప్రతిపక్ష నేతలు నిత్యం ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తుంటే, మరోవైపు పరిణామాలు మాత్రం పూర్తిగా వేరే కోణంలో సాగుతున్నాయి. గతంలో రాష్ట్రంలో 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, తమపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ గట్టిగా వాదిస్తూ వచ్చింది. అయితే, దీనిపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్థులను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా రెడ్ బుక్ తెరవాల్సిన పనే లేదని, కొందరు నేతలు తమ స్వయంకృతాపరాధాలతోనే తమ కొంప తామే ముంచుకుంటున్నారని ఆయన పరోక్షంగా సెటైర్లు పేల్చారు.
ఈ వాదనకు అక్షరాలా బలం చేకూర్చేలా ఇప్పుడు వైఎస్సార్సీపీ(YSRCP)కి చెందిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా చట్టం చిక్కుల్లో పడుతున్నారు. ప్రత్యర్థుల కుట్రల కంటే, సొంత కుటుంబ వివాదాలు, ఆరోపణలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలే వారి కొంపముంచుతున్నాయి. ఒకనాడు అధికార దర్పంతో చెలరేగిన ప్రముఖులే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి తలెత్తింది.
ఇందుకు తాజా ఉదాహరణ మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబం. ఆయన పెద్ద కోడలు జోగి మేఘన తన భర్త, అత్తమామలపై నేరుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. గృహ హింస, హత్యాయత్నం, వరకట్న వేధింపుల చట్టం కింద నమోదైన ఈ కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, సోదరి రమతో సహా మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. అరెస్ట్ భయంతో వీరంతా విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించి ముందస్తు పిటిషన్లు వేయాల్సి వచ్చింది.
కేవలం కుటుంబ వివాదాలే కాకుండా, ఇతర సీనియర్ నేతల విషయాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. భూకబ్జాలు, బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) అజ్ఞాతంలోకి వెళ్లినా హైకోర్టులో ఊరట లభించలేదు. చివరికి ఆయన శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవక తప్పలేదు. మరోవైపు, మద్యం రానా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది, ఆయన పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది.
అలాగే, మరో మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు(Seediri Appalaraju) తన కుమారుడు భాగమైన రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించి ప్రస్తుతం రిమాండ్ మీద జైలుపాలయ్యారు. ఈ ఉదాహరణలన్నీ పరిశీలిస్తే, వైఎస్సార్సీపీ నేతలు ఎవరి కక్షసాధింపుల వల్ల కాకుండా, తమ సొంత తప్పిదాల వల్లే ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్న వాదన నిజమని తేలుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, నేతలు తమ స్వయంకృతాపరాధాలతోనే మూల్యం చెల్లించుకుంటున్నారన్నది ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.