వైసీపీపై మరోసారి వ్యంగ్యాస్త్రాలతో మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ``అర్ధమైందా రాజా?`` అంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇదేసమయంలో లోకేష్ వ్యాఖ్యలు వైరల్గా కూడా మారాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో లోకేష్ మాట్లాడుతూ.. ఎర్రబస్సు రాని చోటకు ఎయిర్ బస్సు వచ్చిందని.. అర్ధమైందా రాజా? అంటూ.. వైసీపీకి పరోక్షంగా చురకలు అంటించారు. తన వ్యాఖ్యల్లో ఎక్కువ భాగం వైసీపీని కార్నర్ చేయడం గమనార్హం. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.
నమో.. అంటే నరేంద్ర మోడీ అంటారని, కానీ, ఇక్కడ నమో అంటే.. `నాయుడు-మోడీ` అని లోకేష్ వ్యాఖ్యానించారు. కట్టు బట్టలతో విభజన సమయంలో అల్లాడిన రాష్ట్రాన్ని ప్రధాని మోడీ ఆదుకున్నారని లోకేష్ ప్రశంసించారు. నమో.. జోడీ కారణంగా నే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు పరుగులు పెడుతోందన్నారు. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాయం చేస్తోందని తెలిపారు. ``పోలవరం, అమరావతి పూర్తి చెయ్యడానికి మోడీ నిధులు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కుని కాపాడారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు`` అని లోకేష్ చెప్పుకొచ్చారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఇతర ప్రాజెక్టులు మన రాష్ట్రానికి రావడానికి కారణం నరేంద్ర మోడీయేనని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా `నమో` అంటూ పలు ప్రసంశలు గుప్పించారు. ప్రతి సందర్భంలోనూ ప్రధాని చేసిన సాయాన్ని గుర్తు చేశారు. ఇక, ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రమే కాకుండా.. ఈ విమానాశ్రయం రాకతో .. రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టడం.. ఉత్తరాంధ్ర పౌరషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు.
``నమో అంటే ధైర్యం. విశ్వాసం, సురక్షిత భారత్. శత్రువు గుండెల్లో భయం. అభివృద్ధి, పేదల సంక్షేమం, భవిష్యత్తుకు భరోసా`` అంటూ.. లోకేష్ ప్రధానిని పొగడ్లలతో ముంచెత్తారు. ఈ సంమయంలో ప్రధాని సైతం సంతోషంగా లోకేష్ వైపు పదే పదే చూడడం గమనార్హం. ఇక, సభకు వచ్చిన వారు.. తమ చప్పట్లతో హర్షాతి రేకాలు వ్యక్తం చేశారు. సభలో మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంయమనంతో సమన్వయంతో వ్యవహరించారు. దాదాపు లక్ష మందికి పైగానే ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా మూడు పార్టీల నేతలు ఏర్పాట్లు చేయడం గమనార్హం.