భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుజాతి ఎవరికీ తలవంచదని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గర్జించారని, ఆయన పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం సముచితమని అన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో దేశంలోనే ఏపీ అగ్రగామి రాష్ట్రంగా మారుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయమని అభిప్రాయపడ్డారు. రైల్వే జోన్ తో పాటు ఎన్నో వరాలు ఏపీకి ఇచ్చి ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ నెరవేర్చారని పవన్ కల్యాణ్ కొనియాడారు.
దేశం కోసం కష్టపడ్డ ప్రధాని మోదీని జెన్ జీ యువత జంతర్ మంతర్ దగ్గర దూషిస్తోంటే తన మనసు తరుక్కు పోయిందని, తనకు కన్నీళ్లు వచ్చాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం కష్టపడుతున్న ప్రధాని మోదీకి ఇవా మనం చివరకు ఇచ్చేది అని పవన్ ప్రశ్నించారు. కొత్త తరానికి ఆయన పడ్డ కష్టం ఏం తెలుసని అన్నారు. ఓ వైపు విదేశాల్లో ఉండే శత్రువులతో...మరోవైపు అంతర్గత శత్రువులతో ఆయన పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని వెంట తామున్నామని, ఆయన మీద మాట పడితే అది తమ మీద పడ్డట్టేనని పవన్ ఎమోషనల్ అయ్యారు.