టాలీవుడ్(Tollywood) ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బావమరిది వివాహ వ్యవహారానికి సంబంధించి విశాఖపట్నంలో వెలుగు చూసిన ఒక సంచలన కేసులో రాహుల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఏకంగా 15 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్(Singer Rahul Sipligunj) బావమరిది కర్వారపు రాహుల్ రెడ్డి పెళ్లి పేరుతో తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యవహారంలో తనపై సింగర్ రాహుల్ బెదిరింపులు పాల్పడ్డారని.. బలవంతంగా తన చేత వీడియో స్టేట్మెంట్లు ఇప్పించినట్లు సదరు యువతి ఆరోపించింది. అంతేకాకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె పోలీసుల ముందు వాపోయారు.
ఈ వివాదంలో కేవలం రాహుల్ రెడ్డి(Rahul Reddy) మాత్రమే కాకుండా.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో పాటు అడ్వకేట్లు, పలువురు జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉండటం గమనార్హం. తొలుత మార్చిలో రాహుల్ రెడ్డిపై మాత్రమే ఫిర్యాదు చేసిన బాధితురాలు, జూన్ నెలలో మరో 11 మంది పేర్లను చేరుస్తూ రెండోసారి ఫిర్యాదు ఇవ్వడం ఈ కేసుపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం వెనుక రూ.కోటి డిమాండ్ లాంటి ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయనే మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. డిమాండ్ నెరవేరకపోవడం వల్లే ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసును ఎంవీపీ కాలనీ పోలీసులు మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే, ఎఫ్ఐఆర్(FIR)లో పేర్లు నమోదైనంత మాత్రాన నేరం రుజువు కాదని, పూర్తి స్థాయి పోలీసు విచారణ తర్వాతే అసలు నిజాలు బయటపడతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.