ప్రతి పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu) వైభవమే వేరు. అయితే, రాబోయే 2027 పుష్కరాలను చూస్తే మాత్రం ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే, ఈసారి కేవలం ఒక ఉత్సవంగా కాకుండా.. ప్రపంచస్థాయి వేడుకగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. అటు ఆధ్యాత్మిక శోభ, ఇటు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ఈ మహాక్రతువును నిర్వహిస్తుండటంతో.. ఇప్పుడీ ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.
గోదావరి పుష్కరాల కోసం సర్కార్ వేసిన అంచనాలు, వ్యూహాలు చూస్తుంటే మతిపోవాల్సిందే. అక్షరాలా రూ.8,500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. తొలి విడతలోనే ఏకంగా రూ.530 కోట్లను కేటాయించి పనులకు స్పీడ్ పెంచేశారు. గోదావరి తీరం పొడవునా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏకంగా 238 పాత, కొత్త ఘాట్లను కొత్త హంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఒక్క నీటిపారుదల శాఖకే రూ.210 కోట్లకు పైగా కేటాయించారంటే పనుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ జాతరలో హైలైట్ ఏమిటంటే.. టెక్నాలజీ వాడకం అదుర్స్ అనిపించేలా ఉంది. కోట్లాది మంది జనం ఒకేసారి తరలివచ్చే ఈ వేడుకలో తొక్కిసలాటలు, ఇతర ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సీసీటీవీ నెట్వర్క్, డ్రోన్లతో నిరంతరం నిఘా పెట్టనున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ను కూడా తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఏ ఘాట్లో రద్దీ ఎలా ఉంది, స్లాట్ బుకింగ్, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, రూట్ మ్యాప్స్ వంటి సమస్త సమాచారం క్షణాల వ్యవధిలో మీ చేతికి అందుతుంది.
కేవలం భద్రత, వసతులే కాకుండా పర్యావరణంపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విశేషం. గోదావరి(Godavari) పవిత్రత దెబ్బతినకుండా ప్రత్యేక ఫిల్ట్రేషన్ గ్రిడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, ఈసారి పుష్కరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చాలని డిసైడ్ అయ్యారు. ప్రతి ఘాట్ వద్ద 24 గంటలు అందుబాటులో ఉండేలా మొబైల్ మెడికల్ టీమ్స్, అంబులెన్సులు, స్విమ్మింగ్ నిపుణులను మోహరిస్తున్నారు. మొత్తానికి చూస్తుంటే, 2027 గోదావరి పుష్కరాలు కేవలం భక్తి భావాలకే పరిమితం కాకుండా.. టెక్నాలజీ మేళవింపుతో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.