ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ప్రధానిని ఎవరు విమర్శించినా.. దూషిం చినా గట్టిగా బదులివ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో యువత ప్రధానిని దూషించిందని గుర్తు చేశారు. అయితే.. ఆయన మంచి మనసుతో యువతను క్షమించారని తెలిపారు. కానీ..ఇది నిరంతరం కొనసాగరాదని చెప్పారు. స్థాయిలు మరిచి వ్యాఖ్యలు చేసేవారిని అస్సలు ఉపేక్షించవద్దని ఆయన దిశానిర్దేశం చేశారు.
విశాఖపట్నంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో నబీన్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీపై కొందరు కక్షగట్టారని వ్యాఖ్యానించారు. వరుస విజయాలు అనేది ప్రధాని మోడీ చరిష్మాకు నిదర్శనమని పేర్కొన్నారు. ఓటమి ఎరుగని నాయకుడని కీర్తించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన వరుస విజయాలు సాధిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే.. ప్రతిపక్షాలు.. మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని.. ఆయన చరిష్మాకు భగ్నం కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు.. ప్రధానిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారని అన్నారు.
``ప్రధానమంత్రి పట్ల ఉపయోగించిన పరుష పదజాలాన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదు" అని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై సెటర్లు సంధించారు. ఆయనను 'పార్ట్-టైమ్ పొలికల్ లీడర్`` అని వ్యాఖ్యానించారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాత్రమే రాహుల్ ప్రాధాన్యం ఇస్తున్నాడని తెలిపారు. ``మనం వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నాం. వారు వినాశ్ భారత్ కోసం పనిచేస్తున్నారు. ఈ తేడాను ప్రజలకు వివరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఇంటింటికీ వెళ్లాలి.`` అని తేల్చి చెప్పారు. అదేసమయంలో యువతను సానుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించాలన్నారు.
ఏపీలో మళ్లీ కూటమే!
రాబోయే ఎన్నికలు కీలకమని నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. 2029లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఏ ఎన్నిక జరిగినా.. పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమిగానే పోటీకి దిగుతామని తెలిపారు. కూటమి పార్టీలను కలుపుకొని వెళ్లే విష యంలో బీజేపీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. ఏపీలో కూడా ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న పథకాలు.. నిధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. ఈ విషయంలో ప్రత్యేక అజెండాను రూపొందించుకుని కార్యాచరణను తక్షణమే ప్రారంభించాలన్నారు.