వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) మరోమారు ప్రజా బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజల చెంతకు చేరేందుకు ఆయన అడుగులు వేస్తుండగా, ఇప్పటికే షెడ్యూల్కు సంబంధించి పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు జగన్(Jagan) స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. "ఈ యాత్ర నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు.. రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసమే" అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్ జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎక్కడా వెనుకడుగు వేయకుండా, గెలుపే లక్ష్యంగా శ్రమించాలని స్పష్టం చేశారు. ఈ పోరులో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని, ఏకగ్రీవాలను అడ్డుకుంటూ బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని తేల్చిచెప్పారు. కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిద్దామని, అయితే విజయం మాత్రం వైసీపీ(YCP)దే కావాలని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఈ యాత్రలను ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారో చూడాలి.