సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయరాలు సుష్మిత చేసిన కామెంట్లు దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, తనను కొందరు నేతలు టార్గెట్ చేశారంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మరోసారి సురేఖ లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా తనను, తన కుటుంబాన్ని కొందరు నేతలు లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒక అంశంపై విచారణ కొనసాగుతోందని, ఈ లోపే సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బహిరంగంగా విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు. కాగ, కొండా సురేఖ సమర్పించిన వివరణపై కమిటీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా సురేఖ ఖండించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.