కాంగ్రెస్(Congress)ను ఎవరూ ఓడించలేరు.. ఆ పార్టీ నాయకులే తమ ప్రభుత్వాన్ని గద్దె దించుకుంటారు అనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పిన రాజకీయ జోస్యం అచ్చంగా నిజమవుతోంది. ప్రత్యర్థులు దాడి చేయాల్సిన అవసరమే లేకుండా, తెలంగాణ కాంగ్రెస్లో పదవుల కోసం సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఆనందం ఆవిరైపోతుండగా, నేతల మధ్య జరుగుతున్న పవర్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
మంత్రివర్గ విస్తరణ వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ మంత్రులు, సీనియర్ నేతలే బహిరంగంగా తిరుగుబాటు బావుటా ఎగరవేయడం కలకలం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కుమార్తె సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులపై చేసిన అవినీతి ఆరోపణలు పార్టీలో మొదటికే మోసం తెచ్చాయి. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ పంచాయితీలు అధిష్టానానికి తలనొప్పిగా మారగా, చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఆందోళన పార్టీని వెంటాడుతోంది.
మరోవైపు, మంత్రి పదవి దక్కక రెండేళ్లుగా రగులుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బయటి నుంచి వచ్చిన వాళ్లకు పెద్ద పీట వేస్తూ, పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలు నేతలను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరో టైమ్ బాంబ్లా పేలాయి. పదవుల ఆశతో సీనియర్లు ఢిల్లీ(Delhi) బాట పట్టడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ సర్కార్ను కూల్చడానికి బీఆర్ఎస్ శ్రమించాల్సిన పనే లేదని స్పష్టమవుతోంది.
ఇలాంటి పరిణామాలు కేసీఆర్ అంచనాలను అక్షరాలా నిజం చేస్తున్నాయి. అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తే అసమ్మతి మరింత పెరుగుతుంది, లేదా చూసీచూడనట్లు వదిలేస్తే ప్రభుత్వ పట్టు సడలిపోతుంది. ఈ ఇరుకుపరిస్థితుల్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ అంతర్గత కుమ్ములాటలను ఎలా ఎదుర్కొంటారు, సొంత పార్టీ నేతల నుంచి ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.