తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఉద్వాసనకు గురయ్యారన్న వార్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి పనితీరుపై సురేఖ కుటుంబం నుంచి వస్తున్న విమర్శలు, అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరడంతో అధిష్ఠానం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిపై కొండా సురేఖ(Konda Surekha) కుమార్తె సుష్మితా పటేల్ బహిరంగంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పార్టీ గీత దాటి వ్యవహరించడం, క్రమశిక్షణ కమిటీ నివేదికలు ఇచ్చినప్పటికీ వైఖరిలో మార్పు రాకపోవడంతో అధిష్ఠానం సీరియస్గా స్పందించింది. స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరినప్పటికీ, దానికి సురేఖ సమ్మతించలేదని సమాచారం. దీంతో సీఎం కార్యాలయం నేరుగా రంగంలోకి దిగి ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ లోక్భవన్కు అధికారికంగా లేఖ పంపినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది.
కాగా, ఈ పరిణామాలు కేవలం ఒక మంత్రి పదవికి పరిమితం కాకుండా, తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో వర్గపోరును మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి. గతంలోనూ పలుమార్లు తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన కొండా సురేఖ, ఇప్పుడు మంత్రి పదవి కోల్పోవడంతో ఆమె తదుపరి రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అధిష్ఠానంతో ఆమె నేరుగా పోరుబాట పట్టనున్నారా లేక భవిష్యత్ వ్యూహం మార్చుకుంటారా అనేది త్వరలోనే తేలనుంది.