తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత సైలెంట్గా ఉన్న కొండా సురేఖ, తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. "నిరీక్షణ ముగిసింది.. భవిష్యత్తుపై త్వరలో కీలక నిర్ణయం ప్రకటిస్తా" అంటూ ఆమె ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అసలు కొండా దంపతుల వ్యూహం ఏంటి? అధికార పార్టీకి వారు ఎలాంటి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు? అనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
మరోవైపు కొండా సురేఖ(Konda Surekha) కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత వేడిని పెంచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, దమ్ముంటే తన తల్లిపై రాజకీయంగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం కక్ష సాధింపు చర్యేనని ఆమె మండిపడ్డారు. "నా తల్లిని ఈ స్థితిలో చూసి రేవంత్ రెడ్డిని శపిస్తున్నాను" అంటూ సుస్మిత చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే సమయంలో కొండా మురళి(Konda Murali) స్టైల్, ఆయన మీసాలు మెలివేయడం వంటి పరిణామాలు కేడర్లో జోష్ నింపుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే కొండా ఫ్యామిలీ ఏదో చేయబోతుందని స్ఫస్టంగా అర్థమవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు తెరవెనుక రచిస్తున్న 'ప్లాన్ బీ' ఏమై ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సురేఖ ప్రకటించబోయే ఆ కీలక నిర్ణయం ఏ క్షణాన ఎలాంటి బాంబు పేల్చుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.