విజయవాడ(Vijayawada) నగరపాలక సంస్థ ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండటంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నగరంలో మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనుండటంతో ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా సిద్ధార్థ్ పేరు మేయర్ అభ్యర్థి రేసులో ప్రముఖంగా తెరపైకి రావడం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
తాజాగా అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే బొండా ఉమ తన కుమారుడు సిద్ధార్థ్తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా విజయవాడ మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి బొండా సిద్ధార్థ్ బయోడేటాను సీఎం చంద్రబాబుకు స్వయంగా అందజేశారు బొండా ఉమ(Bonda Uma). విద్యావంతుడైన సిద్ధార్థ్కు ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పం ఉందని, బెజవాడ నగర పాలనలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికర ప్రచారం జోరుగా సాగుతోంది. బొండా సిద్ధార్థ్(Bonda Siddhartha) అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా స్పందించడమే కాకుండా, పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే వార్త టీడీపీ శ్రేణుల్లో హల్చల్ చేస్తోంది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, బొండా కుటుంబం నిలకడైన రాజకీయ వైఖరిని ప్రదర్శించింది.
అనేక ఒత్తిళ్లు, కేసులు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయకుండా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్షేత్రస్థాయి క్యాడర్కు ధైర్యం కల్పించడంలో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించారని ఆయన మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కుటుంబాలకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని చంద్రబాబు(Chandrababu) భరోసా ఇచ్చి, క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని సూచించడంతో బొండా క్యాంప్ ఫుల్ జోష్లో ఉన్నట్లు పార్టీ తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.