ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారింది. 2024 ఎన్నికల ఓటమి నుంచి తేరుకుని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ కేడర్తో జరిగిన భేటీలో తన ల్యాండ్మార్క్ నిర్ణయాన్ని వెల్లడిస్తూ... 'పాదయాత్ర 2.0'కు ముహూర్తం ఖరారు చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ ప్రజాక్షేత్ర యాత్ర, 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాగనుందని స్పష్టం చేశారు.
గతంలో 2017లో చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర' వైఎస్సార్సీపీ(YSRCP) రాజకీయ ప్రస్థానాన్ని మలుపు తిప్పి, 2019లో ఆయనను అధికార పీఠం ఎక్కించింది. ఇప్పుడు మళ్లీ అదే 'పాదయాత్ర' అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని జగన్ భావిస్తున్నారు. సుదీర్ఘ దూరాలు నడుస్తూ, ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, వైకాపా కేడర్లో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.
లోకేష్ కౌంటర్ ప్లాన్.. ముందస్తు వ్యూహాలు!
అయితే, జగన్ 'పాదయాత్ర 2.0' (Jagan Padayatra 2.0) ప్రకటన అధికార కూటమిలో, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ వర్గంలో సరికొత్త అలర్ట్నెస్ను తీసుకొచ్చింది. జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి వేసే ఎత్తులకు ముందే పైఎత్తులు వేసేందుకు లోకేష్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో 'యువగళం' ద్వారా సాధించిన అనుభవంతో పాటు, ఈసారి ప్రభుత్వ ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లేలా పక్కా రోడ్మ్యాప్ తయారు చేస్తున్నారు. జగన్ మోపే ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రత్యక్ష ప్రజా సంబంధాల నెట్వర్క్ను లోకేష్ బలోపేతం చేస్తున్నారు.
కాగా, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఏపీ పొలిటికల్ హీట్ అప్పుడే పరాకాష్టకు చేరింది. ఒకవైపు పోగొట్టుకున్న వైభవాన్ని ప్రజాక్షేత్రం ద్వారానే తిరిగి సాధిస్తానని జగన్ తొడగొడుతుంటే... ప్రతిపక్ష వ్యూహాలను ఆదిలోనే తుత్తునియలు చేసేందుకు లోకేష్(Lokesh) కౌంటర్ అటాక్కు సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రాజుకున్న ఈ రాజకీయ పోరు.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఎటు తిప్పుతుందో వేచి చూడాలి.