సరిగ్గా మూడేళ్ల కిందట.. 2023, సెప్టెంబరు 9న(ఇదే రోజు) తనను వైసీపీ పాలకులు అన్యాయంగా అరెస్టు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ.. భావోద్వేగానికి గురయ్యారు. అక్రమ కేసులు బనాయించి.. 53 రోజుల పాటు జైల్లో పెట్టారని తెలిపారు. అయితే.. ఆ నాడు.. తన అరెస్టును ఖండిస్తూ.. ఊరూవాడా ఏకమై.. తనకు మద్దతుగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఎక్కడున్నా.. ఆనాటి ఘటనను ఖండించిందని తెలిపారు.
వారి రుణం తాను తీర్చుకోలేనని సీఎం చెప్పారు. ``నేను ప్రజలకే నాజీవితాన్ని అంకితం చేశా. ఆనాడు కూడా.. నన్ను ప్రజల మధ్యే అరెస్టు చేశారు. ఎందుకుఅరెస్టు చేస్తున్నారని.. ఆనాడు అధికారులను ప్రశ్నించా. కానీ పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఏ సెక్షన్ కింద అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. అయినా.. భరించా. ప్రజలు నా ఆవేదనను అర్థం చేసుకున్నారు. నాకు అండగా ఉన్నారు.`` అని చంద్రబాబు చెప్పారు.
పవన్ కల్యాణ్ ఆనాడు తీవ్ర ఆవేదనకు గురయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. తాను రాజమండ్రి జైల్లో ఉంటే చూసేందుకు వచ్చాడని.. అయితే.. ఆయనను కూడా అడ్డుకున్నారని.. ఆ అడ్డంకులను కూడా తొలగించుకుని పవన్ తనను జైల్లోనే కలిసినట్టు తెలిపారు. ఆనాడు ప్రజలంతా ఏకమై.. తనకు అండగా నిలిచారని పదే పదే చెప్పుకొచ్చారు. నాటి దుష్ట పరిపాలనను అంతం చేసేందుకు కూటమిగా ఎన్నికల కు వెళ్తే.. ప్రజలు ఆశీర్వదించారని.. ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
కోనసీమ జిల్లాలో బుధవారం పర్యటించిన చంద్రబాబు.. పి.గన్నవరం మండలంలో రైతులకు పట్టాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆస్తులపై బొమ్మలు వేయించుకున్నారని.. ప్రజల హక్కులను వారి హక్కులుగా అనుభవించే ప్రయత్నం చేశారని అందుకే.. తాము అధికారంలోకి వస్తే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. దానిని రద్దు చేశామన్నారు. ఇప్పుడు ప్రజల ఆస్తి.. ప్రజలకే చెందుతోందని వారంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు.