జ‌గ‌న్ కు సాయిరెడ్డి స్ట్రోంగ్ కౌంట‌ర్‌.. కాక‌రేపుతున్న ట్వీట్‌!

admin
Published by Admin — February 07, 2025 in Politics
News Image

మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తాజాగా వైసీపీ అధ్య‌క్ష‌డు, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయాల నుంచి సాయిరెడ్డి త‌ప్పుకోవ‌డం ప‌ట్ల గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ ప్రెస్ మీట్ లో జ‌గ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రాజకీయాల్లో ఉన్న వారికి వ్య‌క్తిత్వం, విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అనేవి ఉండాల‌ని.. భ‌య‌ప‌డో లేక మ‌రో కార‌ణం చేత‌నో రాజీప‌డితే క్యారెక్ట‌ర్ కు ఏం విలువుంటుందని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అధికారం ఐదేళ్లు మాత్రమే అని.. ఆ ఐదేళ్లు ఓర్చుకుని నిల‌బ‌డ్డ‌వాడే ప్ర‌జ‌ల్లో అస‌లైన లీడ‌ర్ అవుతాడంటూ సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లి పోయిన మిగ‌తా ముగ్గురు రాజ్యసభ సభ్యులకు జ‌గ‌న్ చుర‌క‌లు అంటించారు. అయితే ఈ విష‌యంపై తాజాగా సాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించ‌కుండానే ప‌రోక్షంగా ఆయ‌న‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

`వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవుల‌తో పాటు రాజకీయాలనే వదులుకున్నా.` అంటూ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో వ‌ర్గాల్లో విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్‌ కాక‌రేపుతోంది.

Recent Comments
Leave a Comment

Related News

Latest News